ఎల్ఐసీలో 3.5% వాటా విక్రయం
ABN , First Publish Date - 2022-04-24T06:18:04+05:30 IST
పబ్లిక్ ఇష్యూ ద్వారా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 3.5 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.
రూ.21,000 కోట్ల సమీకరణ లక్ష్యం
మే మొదటి వారంలో ఐపీఓ
27న సెబీకి ఆర్హెచ్పీ దాఖలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 3.5 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ ఇష్యూ మార్కెట్లోకి అడుగుపెట్టనుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇష్యూ పరిమాణం రూ.21,000 కోట్ల వరకు ఉండనుందని ఆ అధికారి పేర్కొన్నారు. కంపెనీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. కాగా ఈ నెల 27న (బుధవారం) మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్హెచ్పీ)ను దాఖలు చేసే అవకాశం ఉందని అ అధికారి తెలిపారు. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించనుందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఆటంకాలతో పాటు స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లలో సాగుతుండటంతో ఎల్ఐసీ ఐపీఓ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో తొలుత ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయించాలని భావించిన ప్రభుత్వం తాజాగా 3.5 శాతానికి తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం నాడు సెబీకి సమర్పించనున్న ఆర్హెచ్పీలో పాలసీహోల్డర్లు, ఉద్యోగులకు షేర్ల కేటాయింపు వివరాలు సహా ఇష్యూ ధర, డిస్కౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆ ఉన్నతాధికారి తెలిపారు.