2022లో రూ.1.22 లక్షల కోట్లకు..
ABN , First Publish Date - 2022-12-06T01:13:31+05:30 IST
ఈ ఏడాది దేశీయ ప్రకటనల పరిశ్రమ (అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ) ఆదాయం 15.8 శాతం వార్షిక వృద్ధితో 1,490 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని గ్రూప్ ఎం అంచనా వేసింది...
భారత ప్రకటనల పరిశ్రమ ఆదాయంపై గ్రూప్ ఎం నివేదిక
2023లో 16.8% వృద్ధి అంచనా
ముంబై: ఈ ఏడాది దేశీయ ప్రకటనల పరిశ్రమ (అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ) ఆదాయం 15.8 శాతం వార్షిక వృద్ధితో 1,490 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని గ్రూప్ ఎం అంచనా వేసింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో ఈ విలువ రూ.1.22 లక్షల కోట్ల పైమాటే. ప్రపంచ మార్కెట్తో పోలిస్తే భారత యాడ్ ఇండస్ట్రీ పటిష్ఠంగా ఉందని సోమవారం విడుదల చేసిన నివేదికలో గ్రూప్ ఎం పేర్కొంది. వచ్చే ఏడాది ఇండియన్ యాడ్ ఇండస్ట్రీ 16.8 శాతం వృద్ధి నమోదు చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది ఇండస్ట్రీ ఆదాయంలో డిజిటల్ ప్రకటన విభాగానిదే మెజారిటీ వాటా (48.8 శాతం)గా ఉండనుందని రిపోర్టు పేర్కొంది. ఈ ఏడాది రిటైల్ మీడియా పరిమాణం 55.1 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని, 2027 నాటికిది దాదాపు రెట్టింపు కావచ్చని అంచనా. మొత్తం యాడ్ మార్కెట్లో 36 శాతం వాటా కలిగిన టీవీ ప్రకటనల విభాగం ఈ ఏడాది 10.8 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని, మున్ముందూ ఈ విభాగం రెండంకెల వృద్ధిని కనబర్చనుందని నివేదిక తెలిపింది.