10 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
ABN , First Publish Date - 2022-10-05T09:16:35+05:30 IST
ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికమూ బిల్డర్లకు కలిసొచ్చింది. ఈ కాలంలో హైదరాబాద్తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు మూడు నుంచి 10 శాతం వరకు పెరిగాయి.
హైదరాబాద్లో ఆరు శాతం అప్..
నైట్ఫ్రాంక్ ఇండియా
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికమూ బిల్డర్లకు కలిసొచ్చింది. ఈ కాలంలో హైదరాబాద్తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు మూడు నుంచి 10 శాతం వరకు పెరిగాయి. బెంగళూరు మార్కెట్లో అత్యధికంగా 10 శాతం పెరిగితే అహ్మదాబాద్లో మూడు శాతం మాత్రమే పెరిగాయి. హైదరాబాద్లో మాత్రం, గత మూడు నెలల్లో ఇళ్ల ధర ఆరు శాతం పెరిగి చదరపు అడుగు సగటు ధర రూ.4,977కు చేరింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. పెరిగిన నిర్మాణ వ్యయాలు తట్టుకునేందుకు బిల్డర్లకు ధరలు పెంచడం తప్ప, మరో మార్గం కనిపించలేదు. డిమాండ్ మంచి ఊపులో ఉండడంతో బిల్డర్లు ఇందుకు ధైర్యం చేశారు.
రెంటల్స్ మరింత పైకి : ఇళ్ల ధరలతో పాటు కార్యాలయాల భవనాల అద్దెలు కూడా పెరిగాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కార్యాలయాల భవనాల్లో నెలవారీ సగటు అద్దె ఎస్ఎఫ్టీ రూ.65కు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏడు శాతం ఎక్కువని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. బెంగళూరులో మాత్రం రెంటల్స్ వృద్ధి రేటు అత్యధికంగా నమోదైంది. అక్కడ ఎస్ఎఫ్టీ సగటు రెంట్ 13 శాతం పెరిగి రూ.81కు చేరింది.
పెరిగిన అమ్మకాలు: గత మూడు నెలల్లో హైదరాబాద్తో సహా ఈ ఎనిమిది ప్రధాన నగరాల్లో 73,691 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. గత తొమ్మిది నెలల అమ్మకాలను పరిగణనలోకి తీసుకున్నా ఇళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది.