పట్టభద్రుల నమోదులో వైసీపీ అక్రమాలు
ABN , First Publish Date - 2022-12-12T02:31:35+05:30 IST
పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
50 వేల బోగస్ ఓట్లు నమోదు: యనమల
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అనర్హులని సైతం ఓటర్ల జాబితాలోకి తెచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 50 వేల బోగస్ ఓట్లు నమోదు అయ్యాయి. అవకతవకలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలువుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలే ఇందుకు నిదర్శనం. వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని ఆదేశాలున్నా అధికార పార్టీ నేతలు లెక్క చేయడం లేదు’’ అని యనమల మండిపడ్డారు.