ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-06-07T06:44:02+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వారిలో కొంత ఉత్కంఠ నెలకొంది.

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

కొత్త జిల్లాలో పలు శాఖల ఆసక్తి
వేసవి సెలవుల్లోగా ఈ ప్రక్రియ పూర్తికి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

భీమవరం, జూన్‌ 6 : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో వారిలో కొంత ఉత్కంఠ నెలకొంది. చాలా ప్రభుత్వ శాఖల్లో బదిలీల కోసం ఎదు రు చూస్తున్నారు. కరోనా కారణంగా మూడేళ్లుగా బదిలీలు సాగడం లేదు. ఒక వైద్య శాఖలో మాత్రం రెండు నెలల క్రితం బదిలీలు జరిగాయి. ఇదే శాఖలో ఏఎన్‌ఎం లకు ప్రమోషన్‌ కూడా ఇవ్వబోతున్నారు. పోలీసులకు కొన్ని బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చారు. కీలకమైన రెవెన్యూ, పంచాయితీరాజ్‌ వంటి అనేక శాఖల్లో బదిలీలు జరగాల్సి ఉంది. ఈ కారణంగానే తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టరేట్‌ వివిధ శాఖల ఉద్యోగులు ఫ్యామిలీతో వచ్చి స్ధిరపడలేకపోతున్నారు. ఇదే విధంగా పురపాలక సంఘాల్లోను ఈ బదిలీలు ఉంటాయని అసోసియేషన్‌ నాయకులు చెప్పారు. ఈ బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కొత్త పశ్చిమ గోదావరి జిల్లాలో వేల మందికి ఈ బదిలీలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తమ బదిలీలపై ప్రభుత్వానికి ఒక వినతిపత్రాన్ని సమర్పిస్తూ వేసవి సెలవులు ముగిసిపోయేలోగా చేయాలని డిమాండ్‌ చేసింది. సోమవారం నుండే సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాల తరపున ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, షేక్‌ షాబ్జి విద్యా శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చి హామీ తీసుకున్నారు. మరోవైపు ఈ బదిలీలు ఏ విధంగా ఉంటాయి? ఎన్నేళ్లకు కటాఫ్‌ డేట్‌ విధిస్తారనేది ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2022-06-07T06:44:02+05:30 IST