నిధుల్లేవ్!
ABN , First Publish Date - 2022-04-10T05:50:53+05:30 IST
వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో నిధులు నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి సంక్షోభంలో పడింది.
ఆర్థిక సంక్షోభంలో పంచాయతీలు
అభివృద్ధికి నోచుకోని గ్రామాలెన్నో..
ఆర్థిక సంఘం నిధులు లాగేసుకున్న ప్రభుత్వం
మైనర్ పంచాయతీల పరిస్థితి దారుణం
పాలనలో సర్పంచ్ల పాత్ర నామమాత్రమే
సొంత సొమ్ముతో అభివృద్ధి పనులు
వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో నిధులు నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి సంక్షోభంలో పడింది. ఉత్సవ విగ్రహాలుగా పాలక వర్గాలు మారాయి. వీరు.. వారు కాదు బలమైన సర్పంచ్లు సైతం గ్రామాల్లో చిన్నపాటి పనులూ చేపట్టలేని దుస్థితి నెలకొంది. ఉన్న ఆర్థిక సంఘం నిధులు తీసేసుకోవడం.. సాధారణ నిధులు మళ్లించి మరల స్టాఫ్వేర్ మార్చి గందరగోళం నడుమ ఆ నిధులు జమ చేయడంతో పంచాయతీ పాలనలోనే ఎన్నడు లేని సంక్షోభం నెలకొంది. మూడేళ్లలో ముచ్చటగా మూడు మీటర్లు కూడా రహదారి పడని గ్రా మాలు ఉండడం పంచాయతీ పాలన అస్తవ్య స్తంగా మారిందనడానికి నిదర్శనం.
భీమవరం రూరల్, ఏప్రిల్ 9 : గ్రామ సర్పంచ్కి విన్నవిస్తే గ్రామంలో సమస్య తీరుతుంది.. అభివృద్ధి పని అవు తుంది అన్న భావన ప్రస్తుత సర్పంచ్ వ్యవస్థలో గ్రామ స్థుల్లో కానరావడం లేదు. సర్పంచ్ గ్రామానికి ప్రఽథమ పౌరుడైనా నిధులు లేకపోవడంతో గతంలో మాదిరి సర్పంచ్ల చుట్టూ కాంట్రాక్టర్లు, అధికారులు కనబడడం లేదు. ప్రభు త్వం అభివృద్ధి పనులు కన్నా సొమ్ము ఖాతాల్లో వేసే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో సర్పంచ్లు ఏదో ఉన్నారులే అ న్నట్టు ఉంది పరిస్థితి. జిల్లాలో 19 మండలాల్లో 368 మంది సర్పంచ్లు ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి ఊసే లేదు. నిధులు లేకుండా వేసవిలో తాగునీటి సమస్య ఎలా గట్టెకేది అన్న ఆందోళన అయా పాలకవర్గాలను వెంటాడు తోంది. గ్రా మాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసినా వాటికి గ్రామ పాలక వర్గాలకు సంబంధం లేనట్టుగా నడుస్తోంది. సచివాలయంలో ఉన్న పలుశాఖల అధికారులు పై అధికారుల సూచనలు పాటిస్తున్నారే తప్ప సర్పంచ్లకు అందుబాటులో లేకపోవడంతో పాలన గాడి తప్పింది.
14, 15వ ఆర్థిక సంఘం నిధులు మాయం
గ్రామాల అభివృద్ధికి ముఖ్యపాత్ర పోషించే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం తీసేసుకోవడంతో గ్రామాల్లో పనులు చేయడానికి దారి లేకుండా పోయింది. 14వ ఆర్ధిక సంఘం చివరి క్వార్టర్, 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి క్వార్టర్ నిధులు ప్రభుత్వం తీసేసుకుంది. అవి లేకపోవడం సాధారణ నిధులు అంతంత మాత్రంగానే మైనర్ పంచాయతీ ల్లో అభివృద్ధికి ముందడుగు వేయడం కష్టంగా మారింది. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు గతంలోలా అందుబాటులో లేకుండా పోవడం గ్రామాల్లో రహదారులు, ఇతర పనులు అభివృద్ధి చేయడానికి లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 50 శాతం రహదారులు వేశారు. ఈ ప్రభుత్వంలో రహదారులన్న ఊసే లేదు. మైనర్ గ్రామాల్లో సాధారణ నిధులు అం తంత మాత్రంగా ఉండ డంతో సిబ్బంది వేతనాలకే సరిపోతోంది. చిన్న పని చేయాలన్నా నిధులు లేని పరిస్థితి.
పంచాయతీలకు నిధులు ఇలా..
గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు కింద సెంట్రల్ గవర్నమెంట్ తలసరి గ్రాంట్ కింద గ్రామ జనాభా ను బట్టి మనిషికి రూ.8 కేటాయిస్తుంది. వీటిని గ్రామా ల్లో అంతర్గత రహదారులు తాగునీరు, డ్రెయినేజీలు వంటి వాటికి ఉపయోగించాలి వాటిని ప్రభుత్వం ఉపయోగించకుండా వెన క్కి తీసుకుంది. గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేయించడం వల్ల వచ్చే స్టాంప్ డ్యూటీ ఆదాయంలో 35 శాతం ప్రభుత్వానికి, మరో 35 శాతం జిల్లాకు, మండలానికి ఉపయోగించాలి. 25 శాతం గ్రామానికి, మిగిలిన 5 శాతం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తాయి. చెరువులు, కొబ్బరి చెట్ల పాటల ద్వారా వచ్చే ఆదా యం, కుళాయి, నీటి పన్నులు ఇతర పన్నులు సాధారణ నిధులు. ఇవి మైనర్ గ్రామాల్లో ఇవి అతి తక్కువగా ఉంటాయి. వీటిని ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం తీసుకోవడం సాఫ్ట్వేర్ మార్పు చేసి తిరిగి వేశారు.
భీమవరం మండలంలోని ఒక మేజర్ పంచాయతీలో 2942 జనాభా ఉంది. గ్రామంలో 52 రహదారులు ఉండగా గత ప్రభుత్వం 40 రహదారులు వరకు సీసీ రహదారులుగా అభివృద్ధి చేయగా, వైసీపీ ప్రభుత్వంలో ఈ మూడేళ్లలో మిగిలిన 12 రోడ్లలో ఒక రహదారిని 300 మీటర్లు గ్రావెల్ రోడ్డుగా అభివృద్ధి చేశారు.ఏ ఇతర అభివద్ధి పనులు జరగలేదు. మంచినీటి పథకం ఓహెచ్ఆర్లు రెండు ఉన్నాయి. ఇవి రెండు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. రెండు ఓహెచ్ఆర్లు కలిపి 80 వేల లీటర్ల కెపాసిటీ. అయితే జనాభాను బట్టి లక్షా 40వేల లీటర్లు ఓహెచ్ఆర్ అవసరం. గ్రామంలో పారిశుధ్యం సమస్య ఎక్కువే. గ్రామంలో ఏ పని చేయాలన్న నిధుల కొరత వెంటాడుతోంది.
భీమవరం మండలంలోని తీర ప్రాంత ఓ గ్రామం మూడు వేల జనాభా కలిగి ఉంది. గ్రామంలో ఈ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో ఒక మీటరు దూరం కూడా సీసీ రహదారులు అభివృద్ధి చెందలేదు. డ్రెయి న్ల సంగతి సరేసరి. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, సాధారణ నిధులు అంతంత మాత్రం కావడంతో ఏ ఒక్క అభివృద్ధి పని చేయడానికి పాలకవర్గానికి కుదరడం లేదు.
సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి
14, 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరైనట్టే అయ్యి వెంటనే ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. తీర ప్రాంత శివారు మైనర్ పంచాయతీ కావడంతో వేరే ఆదాయం వనరులు లేవు. మా పంచాయతీ అభివృద్ధి ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడి ఉంది. ప్రజలు తాగడానికి నీటికోసం ఇబ్బందులు పడుతున్నారని సొంత నిధులతో ఫిల్టర్ బెడ్స్ బాగు చేయించా.. పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో నా సొంతసొమ్ము జీతాలుగా ఇచ్చా ను. ఇప్పటి వరకు సుమారు రూ.6లక్షలు ఖర్చు చేశాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడం ఏంటి?
– మంతెన శ్రీనివాసరాజు, సర్పంచ్ ఎస్సీ బోస్ కాలనీ, (కాళ్ల)
సొంత నిధులు రూ.20 లక్షలు ఖర్చు
14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 15 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 లక్షలు ప్రభుత్వం వెన క్కి తీసుకోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. కనీసం వీధిలైట్లు కొనాలన్నా నిధులు లేదు. గడిచిన ఏడాది నుంచి సుమారు రూ.20లక్షలు సొంతసొమ్ము ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
– గేదెల జాన్, కలవపూడి సర్పంచ్(కాళ్ళ)
ఏ పనులు చేయలేకపోతున్నాం
పంచాయతీ ఆర్థిక సంఘ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మళ్లిం చు కోవడంతో గ్రామంలో అభి వృద్ధి పనులు చేయలేకపోతు న్నాం. మా గ్రామానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.9లక్షల 60 వేలు, 15వ ఆర్థిక సంఘ నిధులు ప్రభుత్వం మళ్లించుకుంది.
– మేడిద సౌజన్య, కాళీపట్నం సర్పంచ్(మొగల్తూరు)
విధులున్నాయి... నిధులు లేవు
పంచాయతీకి వార్షికాదాయం సుమారు రూ.4లక్షలు వస్తుంది. సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు ఈ నిధులు సరిపో వడం లేదు. 15 ఫైనాన్స్ నిధులు రూ.5,45,350 రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడంతో ఏ పని చేపట్ట డానికి లేకుండా పోయింది.
– బాల వెంకటేశ్వరరావు, మందపాడు సర్పంచ్(ఆకివీడు)