మసాజ్ సెంటర్ పేరిట..
ABN , First Publish Date - 2022-11-16T23:59:45+05:30 IST
పేరుకు బ్యూటీ అండ్ స్పా సెంటర్.. లోపలకు వెళితే మాత్రం అంతా విరుద్ధమే.
అదుపులోకి ముగ్గురు నిందితులు.. నలుగురు బాధిత మహిళలు
భీమవరం క్రైం, నవంబరు 16 : పేరుకు బ్యూటీ అండ్ స్పా సెంటర్.. లోపలకు వెళితే మాత్రం అంతా విరుద్ధమే. మసాజ్ పేరుతో మహిళలతో వ్యభిచారం చేయించి కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు. చివరకు పోలీసులు ముఠా గుట్టును రట్టు చేశారు. టూ టౌన్ సీఐ కృష్ణకుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలివి.. టూటౌన్లోని తమ్మిరాజు నగర్, చిన అమిరంలో కొంత కాలంగా లావిస్ బ్యూటీ అండ్ స్పా అనే పార్లర్ నడుపుతున్నారు. ఈ ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీ శ్రీనాథ్ ఆదేశాలతో మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నిర్వాహకులు భీమవరం కొవ్వాడ పుంతకు చెందిన యింగువ శివసురేష్, విజయవాడకు చెందిన మాంధతి మాధవ్, హైదరాబాద్కు చెందిన గడ్డం వినోద్కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నరసాపురానికి చెందిన సత్యదేవ్, విశాఖపట్నంకు చెందిన ప్రతాప్ పరారీలో ఉన్నారు. నలుగురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సెంటర్లో రూ.96,130 నగదు, 10 సెల్ఫోన్లు, 20 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. గతంలో భీమవరంలో మసాజ్ సెంటర్ల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు తీసుకొచ్చి వ్యభిచార కేంద్రాలు నిర్వహించగా అప్పట్లో అరెస్టులు చేశారు. సమావేశంలో ఎస్ఐలు అప్పారావు, రాంబాబు, సిబ్బంది బాబూరావు, తదితరులు ఉన్నారు.