నేటి నుంచి పిల్లలకు కోర్బెవ్యాక్స్ టీకా
ABN , First Publish Date - 2022-03-16T06:25:59+05:30 IST
జిల్లాలో వున్న లక్షా ఏడు వేల మంది 12–14 ఏళ్ల పిల్లలకు తొలిసారిగా కొవిడ్ టీకా మందు బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు.
12–14 ఏళ్ల వయసు వారికి ప్రత్యేకం
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 15 : జిల్లాలో వున్న లక్షా ఏడు వేల మంది 12–14 ఏళ్ల పిల్లలకు తొలిసారిగా కొవిడ్ టీకా మందు బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. లక్ష డోసుల వ్యాక్సిన్ నిల్వలను మంగళవారం రాత్రి జిల్లా కు ప్రత్యేక వాహనంలో వచ్చాయి. 2008 మార్చి 15 నుంచి 2010 మార్చి 15వ తేదీలోపు జన్మించిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ను వేస్తారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు పిల్లలను సమీప పీహెచ్సీలకు పంపించాల్సిందిగా అన్ని పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలివ్వాల్సిందిగా డీఈవో రేణుకను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. ఒక్కో విద్యార్థికి 0.5 ఎంఎల్ డోసు వ్యాక్సిన్ను చేతి కండరానికి వేస్తారు. 28 రోజుల వ్యవధిలో రెండో డోసు ఇస్తారు. తొలుత లాంఛనప్రాయంగా ఏలూరు, పరిసర ప్రాంత పాఠశాలల్లో వ్యాక్సిన్ పంపిణీని బుధవారం ప్రారంభించి గురువారం నుంచి జిల్లా అంతటా అన్ని పాఠశాలలకు వర్తింపజేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.