పోలీసుల నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి
ABN , First Publish Date - 2022-09-26T05:10:56+05:30 IST
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు.
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించిన చింతమనేని
పెదవేగి, సెప్టెంబరు 25 : పోలీసుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలని, ఫిర్యాదు చేసిన సమయంలోనే స్పందించి ఉంటే ప్రాణాలు నిలబడేవని, నిర్లక్ష్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. వేగివాడలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన 17 ఏళ్ళ గెల్లా అనితా పావని, ఆమె తల్లి దేవి మృతికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు–జంగారెడ్డిగూడెం రహదారిపై వేగివాడ సెంటర్లో ఆదివారం ఉదయం ప్రభాకర్ బాధిత కుటుంబసభ్యులతో కలిసి రాస్తారోకో చేశారు. దీంతో ప్రభాకర్ను ఏలూరు రూరల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించి, ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడ నుంచి పెదవేగి పోలీస్ స్టేషన్కు చేరుకున్న చింతమనేని తల్లీ, కుమార్తె మృతికి పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణమన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మృతుల బంధువుల ఇస్తున్న సమాచారం కాదని, డీఎస్పీ తనకు ఇష్టం వచ్చినట్లు పంచనామా నిర్వహించారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, డీఎస్పీని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దిశ చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభాకర్ తెలిపారు. టీడీపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్, పెదవేగి, లక్ష్మీపురం గ్రామాల సర్పంచ్లు తాతా శ్రీరామ్మూర్తి, మేకా కనకరాజు, పార్టీ నాయకులు మాదు రవికుమార్, కొనకళ్ళ శివమణి, బొకినాల రాంబాబు పాల్గొన్నారు.