నూతన ఆఫర్లు
ABN , First Publish Date - 2022-12-31T22:41:56+05:30 IST
న్యూయర్ వేడుకలతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సందడి నెలకొంది. రెండురోజులుగా గణపవరం, పిప్పర తదితర గ్రామాల్లో వ్యాపారులు ప్రజలను ఆకట్టుకునేందుకు రాయితీల ద్వారా హోరెత్తించారు.
గణపవరం, డిసెంబరు 31: న్యూయర్ వేడుకలతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సందడి నెలకొంది. రెండురోజులుగా గణపవరం, పిప్పర తదితర గ్రామాల్లో వ్యాపారులు ప్రజలను ఆకట్టుకునేందుకు రాయితీల ద్వారా హోరెత్తించారు. దుకాణాల వద్ద రకరకాల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడటంతో ఒక బిర్యానికి కూల్డ్రింకులు, ఐస్క్రీమ్లు, రాయితీలు ప్రకటించారు. అలాగే పండ్లు, స్వీట్లు, కేకులు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బాణసంచాను కాల్పులు నిర్వహించరాదని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దుకాణాలు కిటకిట
చింతలపూడి, డిసెంబరు 31 : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం నుంచి చింతలపూడిలో పండ్లు, పూలు, రంగులు, స్వీట్ హోంలు, బేకరీలు, పలావు సెంటర్లు కిటకిటలాడాయి. బిర్యానీ సెంటర్లు పోటీలు పడి ఆఫర్లతో శిబిరాలు వేసి అమ్మకాలు జోరుగా సాగించారు. మారుతీనగర్ నుంచి ఫైర్స్టేషన్ సెంటర్ వరకు పలావు సెంటర్ల శిబిరాలతో రోడ్లు రద్దీగా మారాయి. సర్కిల్ పరిధిలో ఎక్కడా హద్దు మీరకుండా బైక్ రైడింగ్ లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, రాత్రి 12.30 గంటలు దాటిన తరువాత ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళాలని సీఐ మల్లేశ్వరరావు శుభాకాంక్షలు తెలుపుతూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.