ఆలయ పరిసరాలు యంత్రాలతో శుభ్రం
ABN , First Publish Date - 2022-03-16T05:47:40+05:30 IST
చిన తిరుపతి దేవస్థానానికి అందిన పరిశుభ్రత యంత్రాల (మెకనైజ్డ్ క్లీనింగ్ మిషన్) పనితీరును అధికారులు మంగళవారం పరిశీలించారు.
ద్వారకాతిరుమల, మార్చి 15: చిన తిరుపతి దేవస్థానానికి అందిన పరిశుభ్రత యంత్రాల (మెకనైజ్డ్ క్లీనింగ్ మిషన్) పనితీరును అధికారులు మంగళవారం పరిశీలించారు. నిత్యాన్నదాన సదనం, భక్తులు అధి కంగా సంచరించే అనివేటి మండప ప్రాంతాన్ని ఈ యంత్రాలతో శుభ్రం చేశారు. ఆలయ విద్యుత్ విభాగ డీఈ టి.సూర్యనారాయణ పర్యవేక్షణలో యంత్రాలు పరిశీలించారు. దాతల సహకారంతో సుమారు రూ.50 లక్షలు విలువైన యంత్ర పరికరాలు దేవస్ధానానికి అందాయి. అన్నదాన భవనం, అనివేటి మండపం, పరిసరాలను నీటితో కడిగి శుభ్రం చేయాలంటే 10 నుంచి 15 మంది వరకూ సిబ్బంది అవసరం. ఈ యంత్రం ద్వారా ఇద్దరు లేక ముగ్గురు చాలు. యంత్రం నుంచి సర్ఫ్ నీరు వదిలి శుభ్రం చేసిన తర్వాత ఆ నీటిని తిరిగి పీల్చుకుంటుంది. ఈ యంత్రాలను ఈనెల 12న పెంటపాడు మండలం జట్లపాలెంకు చెందిన కోడూరి వీరరాఘవులు, ఆయన కుమార్లు విజయ్, అజయ్లు, మండలంలోని గొల్లగూడెంకు చెందిన బొండాడ వెంకన్నబాబు దేవస్థానానికి అందజేశారు.