AP News: పాదయాత్రపై పిచ్చి పిచ్చి మాటలు మానుకొండి లేకపోతే.. మహిళల వార్నింగ్..
ABN , First Publish Date - 2022-09-29T17:16:05+05:30 IST
అమరావతి రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది.
పశ్చిమగోదావరి (West Godavari): అమరావతి రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. రైతుల పాదయాత్రకు జనం అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, కొవ్వలి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు 15 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్బంగా మహిళలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారని కొందరు వైసీపీ నేతలు (YCP Leaders) చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు బలసి రైతులు పాదయాత్ర చేయడంలేదని, వైసీపీ నేతలే ఇంట్లో కూర్చొని ఒళ్లు బలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అవకాశం ఉంటే సహాయం చేయాలని, లేకపోతే మూసుకుని కూర్చోవాలన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఒక రాజధానికే దిక్కలేదని.. ఇక మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని మహిళలు ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తింటూ ఇంట్లో ఏపీలో కూర్చొని ఒళ్లు బలిసి రైతులను తిడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ ఒప్పుకున్నారని, మాటతప్పం, మడం తిప్పమన్నారని.. అందుకే రైతులు పొలాలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మడం తిప్పారని విమర్శించారు. తమ పొలాలు 29 గ్రామల ప్రజల కోసం ఇవ్వలేదని, ఐదున్నార కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చామన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రాజధాని కోసం 30 వేల ఎకరాలు అవసరం అవుతాయని అన్నారని.. ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి ఏకైక రాజధానిగా జగన్ ప్రకటించాలని మహిళలు డిమాండ్ చేశారు.