కోటిపల్లి రైల్వే పనులకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-09-08T05:55:49+05:30 IST

కోటిపల్లి రైల్వే లైన్‌ పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది.

కోటిపల్లి రైల్వే పనులకు బ్రేక్‌
చించినాడ వద్ద నిలిచిన రైల్వే వంతెన పనులు

 వరద కారణంగా చించినాడ వద్ద నిలిచిన వంతెన పనులు

 రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం నిధులు  చెల్లించలేదు 

 మూడేళ్లుగా రైల్వే శాఖ నిధులతోనే పనులు 

నరసాపురం, సెప్టెంబరు 7: కోటిపల్లి రైల్వే లైన్‌ పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది. వరద కారణంగా జూన్‌ నెలాఖరు నుంచి చించినాడ వద్ద చేపడుతున్న రైల్వే వంతెన పనులు నిలిచిపోయాయి. అక్టోబరు నెలాఖరు వరకు పనులు చేపట్టే అవకాశాలు లేకపోవడంతో ఎక్కడిపనులు అక్కడ అగిపోయాయి. సుమారు 1.3 కిలోమీటర్ల మేర వశిష్ఠ గోదావరిపై ఇరవై స్తంభాలతో ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ భారీ వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనులకు సుమారు రూ.200 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇప్పటివరకు 18 పిల్లర్ల పనులు మొదలయ్యాయి. వీటిలో ఏడు పిల్లర్లు నిర్ణీత ఎత్తు 18 అడుగులకు వచ్చాయి. మిగిలినవి పలు దశల్లో ఉన్నాయి. ఇంకా రెండు పిల్లర్ల పనులు ప్రారంభించాల్సి ఉంది. 2016లో ఈ వంతెన పనులు ప్రారంభించారు. షెడ్యూల్‌ ప్రకారం గత ఏడాదికి పనులు పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనుల్లో చెల్లించాల్సిన 25శాతం నిధులు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్లుగా రైల్వేశాఖే నిధులు కేటా యిస్తూ వస్తుంది. వాటితోనే పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం పెండింగ్‌ పడిన బకాయి లు చెల్లిస్తే వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులు పూర్తి చేసి ట్రాక్‌ నిర్మాణ పనుల్ని ప్రారంభించాలని రైల్వే యోచిస్తుంది. నరసాపురం నుంచి కోటిపల్లి వరకు 51 కిలోమీటర్ల నిర్మించే ఈకొత్త లైన్‌లో మూడు భారీ వంతెనలు ఉన్నాయి. అందులో కోటిపల్లి, పాసర్లపూ డితో పాటు చించినాడ ఒకటి. ఈ మూడు  వంతెన పనులు పలు దశల్లో ఉన్నాయి. 


Updated Date - 2022-09-08T05:55:49+05:30 IST