మత్స్యకార భరోసా అవినీతిమయం
ABN , First Publish Date - 2022-02-19T05:54:20+05:30 IST
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్యకార భరోసా అంతా అవినీతిమయమని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనో హర్ ఆరోపించారు.
జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల
నరసాపురం, ఫిబ్రవరి 18: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్యకార భరోసా అంతా అవినీతిమయమని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనో హర్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐదు రోజుల పర్యటన ముగిం చుకుని నరసాపురం విచ్చేసిన ఆయనకు శుక్రవారం మాధవాయిపాలెం రేవులో జన సైనకులు పడవలపై ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ముందుగా బుడిదల రేవులోని కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి మనోహార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి తీరం వెంబడి ఉన్న మత్స్యకార వార్డుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 217 జీవో మత్స్యకారుల పొట్ట కొట్టే విధంగా ఉందన్నారు. జీవో కారణంగా 2500 సొసైటీలు రోడ్డున పడ్డాయన్నారు. మత్స్యకారులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిన హెల్ప్ లైన్కు రోజుకు వందల్లో ఫోన్లు వస్తున్నాయన్నారు. రెండేళ్లగా ప్రభుత్వం మృతి చెందిన మత్స్యకారులకు ప్రమాద బీమా ఇవ్వడం లేదన్నారు. మత్స్యకారుల సమస్యలపై ఈ నెల 20న జరిగే సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారన్నారు. ఆయన వెంట కన్వీనర్ బొమ్మిడి నాయకర్, చాగంటి మురళి, కోటిపల్లి వెంకటేశ్వరావు, వాతాడి కనకరాజు, దివి సత్యన్, పోలిశెట్టి సాంబ, నాగు, పోలిశెట్టి నళిని, కొప్పాడి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.