మధ్యవర్తిత్వం వహిస్తా

ABN , First Publish Date - 2022-11-28T01:00:34+05:30 IST

నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించటానికి తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని, మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు మాగంటి బాబు స్పష్టం చేశారు.

మధ్యవర్తిత్వం వహిస్తా
‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

నూజివీడు, నవంబరు 27: నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించటానికి తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని, మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు మాగంటి బాబు స్పష్టం చేశారు. ఆదివారం నూజివీడు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో స్థానిక నాయకులకు సోషల్‌ మీడియాలో జరుగుతున్న పోస్టింగ్‌ల యుద్ధం సరికాద న్నారు. గ్రూప్‌లు లేకుండా వ్యవహరించాలని, చాట్రాయి మండలంలోని ఇబ్బందులను సరి చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీనే అన్నారు. జగన్మోహన్‌రెడ్డికి జైలుకు వెళ్ళకుండా ఉండటా నికి రాష్ర్టాన్ని తాకట్టుపెడుతున్నారన్నారు. కొంతమంది స్వార్థపరులు వారి వ్యాపార అవసరాల కోసం టీడీపీని వీడి వెళ్ళారని, అయినా పార్టీకి నష్టం లేదని, కార్యకర్తల బలమే తెలుగుదేశానికి రక్ష అన్నారు. అందరూ కలిసికట్టుగా పోరాడి, చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావాలన్నారు. మరోసారి పొరపాటున జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో, ప్రజలు, రైతులు, వ్యాపా రులు పక్కరాష్ర్టాలకు వలసవెళ్ళటం ఖాయమన్నారు. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలారని, చంద్ర బాబు, లోకేష్‌లను టచ్‌చేస్తే కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి అంశంపైన, అలాగే పోల్‌ మేనేజ్‌మెంట్‌ పైన, నూజివీడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఇదేం ఖర్మ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. నూజివీడు పట్టణం, రూరల్‌, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:00:46+05:30 IST