నాకు భయం అనేదే లేదు
ABN , First Publish Date - 2022-06-07T06:54:53+05:30 IST
తాను దేనికి భయపడేది లేదని ఈ రోజు పోతే రూపు నేను పోతే నా వెనుక ఉన్నవాడు వచ్చి పోరాడుతాడని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
భద్రత కల్పించాలని, రైతు సమస్యలపై స్పందనలో ఫిర్యాదు
ఏలూరు రూరల్, జూన్ 6 : తాను దేనికి భయపడేది లేదని ఈ రోజు పోతే రూపు నేను పోతే నా వెనుక ఉన్నవాడు వచ్చి పోరాడుతాడని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దంటూ ఏలూరులో స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల క్రితం ఓ అగంతకుడు ఫోన్ చేసి తనను చంపడానికి షూటర్ను పురమాయించారని బెదిరించాడని అగంతకుడి ఫోన్ నెంబర్, కాల్ రికార్డింగ్తో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని ఇన్ఛార్జి కలెక్టర్ అరుణ్ బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనను హత మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే తనపై 26 కేసులు నమోదు చేసిందని అందులో 14 ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారన్నారు. సీఎం జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయించాలని సవాల్ విసిరారు. మంత్రి జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డిలు చింతమనేని ప్రభాకర్ అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తనపై మాట్లాడే మంత్రులపై వాళ్ల నియోజక వర్గంలోనే నడిరోడ్డుపై చర్చకు సిద్ధమని వస్తారా అంటూ సవాల్ విసిరారు. దేవుడు పూజలు చేసుకోమని మంత్రి పదవి ఇచ్చారని కానీ నువ్వు చేసే అవినీతిపై తాడేపల్లిగూడెం బ్రిడ్జిపై చర్చకు సిద్ధమేనా అని కొట్టు సత్యనారాయణకు సవాల్ విసిరారు. దిశ డీఎస్పీ సత్యనారాయణ తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బి.సింగవరంలో తనపై ఈవ్టీజింగ్ కేసు పెట్టారని ఇది ఎంత దారు ణమని ప్రశ్నించారు. తనది ఈవ్ టీజింగ్ చేసే వయసా అని అన్నారు.