బాబోయ్..భారీ వాహనాలు!
ABN , First Publish Date - 2022-11-19T00:44:35+05:30 IST
విస్సన్నపేట–వెలగలపల్లి ఆర్అండ్బీ రహదారి (వీవీ రోడ్డు)పై భారీ వాహనాలు మందలుగా రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్లు ధ్వంసమవటమే కాక ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోని వాహన చోదకులు, ప్రజలు హడలిపోతున్నారు.
పట్టించుకోని అధికారులు
విస్సన్నపేట–వెలగలపల్లి ఆర్అండ్బీ రహదారి (వీవీ రోడ్డు)పై భారీ వాహనాలు మందలుగా రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్లు ధ్వంసమవటమే కాక ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోని వాహన చోదకులు, ప్రజలు హడలిపోతున్నారు. 6 నెలల క్రితం ఈ రహదారిపై బీటీ లేయర్ వేశారు. భారీ వాహనాల తాకిడికి రహదారి శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(చాట్రాయి)
కొద్ది నెలలుగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, మేడూరు క్రషర్ల నుంచి 40, 50 టన్నుల బరువు కంకరతో భారీ వాహనాలు చింతలపూడి ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు వరుసగా 5, 6 వస్తుండటం, అసలే సింగల్ రోడ్డు కావటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నాయి. ఓవర్ లోడ్, అతివేగం వల్ల భారీ వాహనాలు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లులోకి దిగిపోతున్నాయి. ఈ నెల 16వ తేదీన చాట్రాయిలో భారీ వాహనం రోడ్డు పక్క డ్రెయిన్లో దిగి ప్రహరీకి తగిలి ఆగిపోయింది. ఈ స్థలంలో నివాస గృహం ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. భారీ వాహనచోదకులు రోడ్డు మలుపుల్లో కూడా అతి వేగంగా నడుపుతుండటంతో బైక్లు, ఆటోలు, కార్లు నడిపేవారు ప్రమాదాలకు గురవుతామేమోనని హడలిపోతున్నారు. చాట్రాయిలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో భారీ వాహనాలు వచ్చినప్పుడల్లా ట్రాఫిక్ నిలిచిపోతున్నది. వర్షం పడితే మంకొల్లు వద్ద రహదారిపై గుంతల్లో వాహనాలు దిగబడిపోతున్నాయి. ఇక్కడ నెల రోజుల క్రితం వరసగా రెండు రోజుల పాటు గంటల తరబడి ట్రాఫిక్ నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సాపురం నుంచి తమ్మిలేరు ప్రాజెక్టు రెగ్యులేటర్ వరకు 15 కిలోమీటర్ల దూరం గల ఈ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చాలని ఐదేళ్ళ క్రితం ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరు కాలేదు. ప్రభుత్వం స్పందించి డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.