మబ్బులు, చిరుజల్లులతో రైతుల పరుగులు

ABN , First Publish Date - 2022-12-09T23:59:21+05:30 IST

వాయుగుండం కారణంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి వాతావరణం మారింది. మబ్బులు, తేలికపాటి వర్షంతో రైతు లు పరుగులు తీస్తున్నారు.

మబ్బులు, చిరుజల్లులతో రైతుల పరుగులు
ఆచంటలో బరకాలతో కప్పిన ధాన్యం రాశులు

ఆచంట / ఆకివీడు రూరల్‌ / పాలకోడేరు / ఉండి / వీరవాసరం / తణుకు, డిసెంబరు 9: వాయుగుండం కారణంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి వాతావరణం మారింది. మబ్బులు, తేలికపాటి వర్షంతో రైతు లు పరుగులు తీస్తున్నారు. మండలంలో మాసూళ్లు జోరుగా సాగుతున్న తరుణంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మాసూళ్లు చేసిన ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఉంది. ధాన్యం తడవకుండా రైతులు బరకాలు కప్పి కాపాడుకుంటున్నారు. మండలంలో ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే మాసూళ్లు జరిగింది. తుఫాన్‌ ప్రభావంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆకివీడు మండలంలో ధాన్యం ఆరబెట్టుకునేందుకు పొలాలు వద్ద రాశులుగా ఉంచారు. వర్షానికి తడవకుండా రాశులపై బరకాలు కప్పి వాటిపై బరువైన వాటిని ఉంచుతున్నారు. పాలకోడేరు మండలంలో ధాన్యం కాపా డుకోడానికి రైతులు పాట్లు పడుతున్నారు. ఉండి, యండగండి, కోలమూరు. ఉప్పులూరు, మహదేవపట్నం, చెరుకువాడ, పెడపుల్లేరు తదితర గ్రామాలలో మాసూళ్లు చేస్తున్నారు. కోత యంత్రంతో ధాన్యం ఒబ్బిడి చేసుకునే పనులను చేపడుతున్నారు. పలుచోట్ల ధాన్యపు రాశులు చేలల్లో ఉన్నాయి. వీరవాసరం మండలంలో రైతులు ధాన్యం రాశులు వర్షానికి తడవకుండా కాపాడుతున్నారు. పెంటపాడు మండలంలో. వర్షాల కారణంగా ఇప్పటికే ఎకరానికి సుమారు 6 బస్తాల వరకూ దిగుబడి కోల్పోయారు. మాసూళ్ల అనంతరం ధాన్యం రహదారులు, కల్లాలపై ఉన్న తరుణంలో చిరుజల్లులు, గాలులతో ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాశులపై గాలులకు ఎగిరిపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. తణుకు మండలంలో పలుచోట్ల ధాన్యం కల్లాల్లోనే ఉంది. పంట తడిచిపోతే నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. పెనుగొండ మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉఇంకా కోయని వరి చేలను నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మాసూలు చేసిన ధాన్యం రాశులపై బరకాలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - 2022-12-09T23:59:25+05:30 IST