దమ్మారో దమ్‌

ABN , First Publish Date - 2022-12-30T00:47:02+05:30 IST

ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలో క్రైం రేటు పెరిగి పోతున్నది. గంజాయి రవాణా, నాటు సారా కేసులు, దొంగతనాలు, హత్యలతో నేరచరిత్ర రాసుకుంటోంది.

దమ్మారో దమ్‌

ఏలూరులో భారీగా గంజాయి కేసులు

పది మందిపై పీడీ యాక్ట్‌

66 కేసుల్లో 14,787 కిలోలు స్వాధీనం

23,726 లీటర్ల సారా ధ్వంసం

645 దొంగతనాలు.. 31 హత్యలు

1,145 మందిపై పందేల కేసులు

ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలో క్రైం రేటు పెరిగి పోతున్నది. గంజాయి రవాణా, నాటు సారా కేసులు, దొంగతనాలు, హత్యలతో నేరచరిత్ర రాసుకుంటోంది. రాష్ట్రంలోనే గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. దీనికి పోలీసుల రికార్డులు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 2022వ సంవత్సరంలో 614 కేసులకు సంబంధించి 73.45 శాతం ముద్దాయిలకు శిక్షలు పడ్డాయి.

(ఏలూరు –ఆంధ్రజ్యోతి)

గంజాయి మత్తులో..

గంజాయి మత్తులో జిల్లా ఊగిసలాడుతోంది. అక్రమ మార్గాల్లో జిల్లాలోకి అడుగు పెడుతున్న గంజాయి యువత జీవితాలను నాశనం చేస్తున్నది. అధిక లాభార్జాన కోసం కేసులకు భయపడకుండా చాలామంది ఈ అక్రమ రవాణాలకు పాల్పడటంతో పోలీసులు పరుగులు పెడుతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఏలూరు నగరం అడ్డాగా మారింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడకు సరఫరా చేయాలన్నా గంజాయి ముఠాకు ఏలూరు పర్ఫెక్ట్‌ ప్లేస్‌ అయ్యింది. 2022లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులను పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తుంది. ఈ ఏడాదిలో 66 కేసులకు సంబంధించి రూ.2,94,10,900 విలువైన 14,787.579 కేజీల గంజాయి పట్టుబడింది.

అక్రమ మద్యం

జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం, సారా గుప్పు మంటుంది. ఒకప్పుడు పొరుగు రాష్ట్రాల మద్యం రావాణా, నాటుసారా రవానాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నా నేటికీ గుట్టుచప్పుడు లేకుండా అక్రమ మద్యం, నాటు సారా గుప్పుమంటూనే ఉంది. ఈ ఏడాదిలో 23,294 లీటర్ల అక్రమ మద్యం, 23,726 లీటర్ల సారా, 5,35,160 లీటర్ల బెల్లం అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. సారా తయారీ దారులపై 2,608 కేసులను నమోదు చేసి 2,913 మంంది ముద్దా యిలను అరెస్టు చేశారు. సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో ఈ ఏడా దిలోనే 10 మందిపై పీడీ యాక్ట్‌లను నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సైబర్‌ నేరాలు

సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల వాడకం పెరిగిన నాటి నుంచి ఈ సైబర్‌ నేరాలు పెరిగినట్టు చెబుతున్నారు. సైబర్‌ క్రైంకు సంబంధించి 73 కేసుల్లో రూ.28,17,898 విలువగ ఆస్తిని స్వాధీనం చేసుకుని 36 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు.

పేకాట, కోడిపందేలు

2022 సంవత్సరంలో 1975 పేకాట కేసులకు సంబంధించి 5,227 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి రూ.70,66,116 స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోడిపందేలకు సంబంధించి 1145 కేసులు నమోదు చేసి 3184 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29,44,731 స్వాధీనం చేసుకుని 3637 కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదాలు

గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2021వ సంవత్సరంలో 251 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా ఈ ఏడాది 233 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో 609 రహదారి ప్రమాదాల్లో 609 మంది క్షతగాత్రులయ్యారన్నారు.

దొంగతనాలు

జిల్లాలో 645 దొంగతనం కేసులు నమోదు కాగా ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,40,64,380 ఆస్తిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్‌కు తరలించారు. ఈ ఏడాదిలో జిల్లావ్యాప్తంగా 31 మర్డర్‌ కేసులు నమోదు కాగా 2021వ సంవత్సరంలో 28 కేసులు నమోదయ్యాయి.

ఏలూరు జిల్లాలో గురువారం ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వార్షిక ముగింపు క్రైమ్‌ రివ్యూ నిర్వహించారు. పలు నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడిం చారు. ఈ ఏడాది 14,787 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 23,726 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశామన్నారు. 31 హత్యలతో పాటు డెకాయిట్‌ కేసులు 1,645 దొంగతనాలు జరిగాయి. 233 వాహన ప్రమాదాలు, 354 రహదారి ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 1975 పేకాట కేసులతో పాటు 1145 కోడిపందేల కేసుల్లో 3184 మందిని అరెస్టు చేసి రూ.29 లక్షల 44 వేల 731 లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-12-30T00:47:05+05:30 IST