వరద నివారణకు ప్రణాళికలు రూపొందించాలి
ABN , First Publish Date - 2022-09-08T05:53:38+05:30 IST
అధిక వరద ఉధృతితో ఔట్ ఫాల్ స్లూయి జ్ దెబ్బ తినడం వల్ల గోదావరి వరద నీరు జిల్లాలో నక్కల మేజర్ డ్రెయిన్, కాజా మేజర్ డ్రెయిన్, దర్భరేవు డ్రెయిన్, పల్లిపాలెంలో లక్ష్మీపురం లాకులు నుంచి గ్రామాల్లోకి వచ్చి నష్టాన్ని తెస్తున్నందున ప్రమాద నివారణకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
పనుల్లో నాణ్యత లోపిస్తే సహించం : కలెక్టర్ హెచ్చరిక
భీమవరం, సెప్టెంబరు 7 : అధిక వరద ఉధృతితో ఔట్ ఫాల్ స్లూయి జ్ దెబ్బ తినడం వల్ల గోదావరి వరద నీరు జిల్లాలో నక్కల మేజర్ డ్రెయిన్, కాజా మేజర్ డ్రెయిన్, దర్భరేవు డ్రెయిన్, పల్లిపాలెంలో లక్ష్మీపురం లాకులు నుంచి గ్రామాల్లోకి వచ్చి నష్టాన్ని తెస్తున్నందున ప్రమాద నివారణకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఇరిగేషన్ పనులపై అధికారులతో సమీక్షించారు. వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా వరద నీరు గ్రామాల్లోకి రాకుండా తాత్కాలిక పునరుద్ధరణ పనులను అంచనా వేసి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అప్రోవల్కు నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఓఅండ్ఎం పథకంలో కాలువ పనులకు సంబంధించి 86 పనులకు రూ.878.29 లక్షలు మంజూరుచేసి టెండర్లు పిలవగా 49 పనులకు టెండర్లు రాగా, వాటిలో 40 పురోగతిలో ఉన్నాయ ని తొమ్మిది పనులు పూర్తయ్యాయన్నారు. డ్రెయిన్ పనులకు సంబంధించి 46 పనులకు రూ.742.24 లక్షలు మంజూరు చేసి టెండర్లు పిలవగా 37 పనులకు టెండర్లు స్పందించగా వాటిలో 22 పురోగతిలో ఉన్నాయని మూడు పూర్తయ్యాయన్నారు. సమీక్షలో జిల్లా జలవనరుల శాఖ అధికారి పి.నాగార్జునరావు, కెనాల్స్ ఈఈ దక్షిణామూర్తి, ఇరిగేషన్ డీఈలు తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
జిల్లాలో సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. కలెక్టరేట్ నుంచి గృహ నిర్మాణాలు, మన బడి నాడు–నేడు ప్రగతిపై గృహనిర్మాణశాఖ, డీఆర్డీఏ, విద్యాశాఖ, రెవెన్యూ పంచాయతీరాజ్, గ్రామవార్డు సచివాలయం సిబ్బందితో బుధవారం వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్షించిన ఆమె జిల్లాలో గృహనిర్మాణాలు, నాడు–నేడు పాఠశాలల పురోగతి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా 14,269 గృహనిర్మాణాలు మంజూరు చేయగా వీరవాసరం, తణుకు అర్బన్ మాత్రమే మెరుగైన పురోగతిని చూపారన్నారు. ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ళ, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ఇంతవరకు లబ్ధిదారుల జాబితాను అప్డేట్ చేయకపోవడంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశారు. డీఈవో ఆర్వీ రమణ, గృహనిర్మాణశాఖ పీడీఏ రామరాజు, పంచాయతీరాజ్ అధికారి కేఎస్ఎస్ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.