విద్యా శాఖలో కలకలం
ABN , First Publish Date - 2022-11-25T00:43:31+05:30 IST
ముఖ ఆధారిత గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) వేయడం లేదని 28 మంది ఉపాధ్యాయులకు, విద్యార్థుల హాజరును సకాలంలో నిర్ణీత ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయలేదని 23 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఆన్లైన్ హాజరు నమోదులో నిర్లక్ష్యం తెచ్చిన తంటా
ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 24 : ముఖ ఆధారిత గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) వేయడం లేదని 28 మంది ఉపాధ్యాయులకు, విద్యార్థుల హాజరును సకాలంలో నిర్ణీత ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయలేదని 23 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వివరణ సహేతు కంగా లేకపోతే టీచర్లు, హెచ్ఎంలపై క్రమశి క్షణా చర్యలు, ప్రైవేటు పాఠశాలలకైతే స్కూలు గుర్తింపు ఉపసంహరణ వంటి చర్యలు తప్పవని డీఈవో ఆర్ఎస్ గంగాభవాని హెచ్చరించారు. తాఖీదులు వెంటనే సంబం ధిత వ్యక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక విద్యాధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో ఒక్కసారి గా విద్యా వర్గాల్లో కలకలం రేగింది. వివిధ యాజమాన్యా ల పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులందరికీ ఫేషి యల్ రికగ్నిషన్ అటెండెన్స్ను తప్పనిసరి చేసిన విషయం విధితమే. ఆ మేరకు ఏలూరు జిల్లాలోని టీచర్లందరూ నిర్ణీత యాప్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని రోజు వారీ అటెండెన్స్ను వేస్తున్నారు. జిల్లాలో దీనిని పరిశీలించగా నిర్ణీత యాప్లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఈ నెల 15 వరకు 28 మంది వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఫేషియల్ రికగ్నిషన్ పద్ధతి న హాజరు నమోదు చేయడం లేదని ధ్రువీకరించుకున్నా రు. సంబంధిత టీచర్లకు ఇదే విషయాన్ని తెలియజేసి హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో తదుపరి చర్యగా షోకాజ్ నోటీసులను జారీ చేశారు. నోటీసులు జారీ అయిన వారిలో మండల పరిషత్, జడ్పీ, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ తదితర యాజమాన్యాల పాఠశాలల ఉపాధ్యాయులున్నారు. అత్యధికంగా పోలవరం మండలానికి చెందిన 12 మంది టీచర్లు నోటీసులు జారీ అయిన వారిలో ఉండగా, మిగతా వారిలో ఆగిరిపల్లి, భీమడోలు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, మండవల్లి, నూజివీడు, పెదపాడు, ఉంగుటూరు, వేలేరు పాడు మండలాల ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
హెచ్ఎంల తడబాటు
విద్యార్థుల రోజు వారీ హాజరును ఉదయం 11 గం టల్లోగా స్టూడెంట్ యాప్ ఆన్లైన్ పోర్టల్లో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల ప్రధానో పాధ్యాయులు నమోదు చేయాలి. ఆ విధంగా జిల్లాలో మొత్తం 23 పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయడంలో అశ్రద్ధ కనబరచడాన్ని గమనించిన జిల్లా విద్యా శాఖ షోకాజ్ నోటీసులను జారీచేసింది. మూడు రోజుల్లోగా వివరణ పంపాలని హెచ్ఎంలను ఆదేశిం చింది. తాఖీదులు జారీ అయిన వారిలో కేంద్ర నిధులతో నిర్వహించే పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయ సహా మరో 12 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. మిగతావన్నీ మండల పరిషత్, జడ్పీ యాజమాన్య పాఠశాలలే. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో బాల బాలికలకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోన్న విషయం విధితమే. ఆ మేరకు భోజన పథకాన్ని వినియోగించుకునే విద్యార్థుల సంఖ్యను రోజు వారీగా ఐఎంఎంఎస్ యాప్లో స్కూలు హెచ్ఎంలు ఉదయమే నమోదు చేయాలి. మరో వైపు స్కూలుకు వచ్చిన విద్యార్థుల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఆన్లైన్ పోర్టల్లో సైతం నమోదు చేయాలి. విద్యార్థుల హాజరును రెండు రకాల యాప్లలో నమోదు చేయాల్సి ఉండటం పనిభారం కావడంతో ఏదో ఒక దానిలో మరిచిపోవడం వల్లే సమస్య తలెత్తినట్టు సమాచారం. దీనితో నిమిత్తం లేకుండా నిబంధనల ప్రకారం జిల్లా విద్యా శాఖ విద్యార్థుల హాజరును ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయని కారణంగా 23 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అమ్మ ఒడి ఆర్థిక సాయానికి విద్యార్థుల హాజరు 75 శాతం తప్పనిసరిగా ఉండాలన్న ప్రభుత్వ షరతును అమలు చేయడంలో ఎక్కడా అవకతవకలకు తావుండ కూడదన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, విద్యార్థుల హాజరును ఉదయం 11 గంట ల్లోగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడంలో విఫలమైనందున స్కూలుకు ప్రభుత్వ గుర్తింపును ఎందుకు ఉపసంహరించుకోకూడదో వివరణలో స్పష్టం చేయాలని ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలను డీఈవో ఆదేశించారు.
=========