వెల్నెస్ సెంటర్లు వెలవెల..!
ABN , First Publish Date - 2022-04-24T05:40:13+05:30 IST
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ వెల్నెస్ సెంటర్లు హెల్త్ లెస్ సెంటర్లుగా మారుతున్నాయి.
సక్రమంగా అందని సేవలు
పెదవి విరుస్తున్న గిరిజనులు
( కొమరాడ )
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ వెల్నెస్ సెంటర్లు హెల్త్ లెస్ సెంటర్లుగా మారుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా మార్పు చేస్తూ ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు)లను నియమించారు. అయితే అధిక శాతం ఆరోగ్య ఉప కేంద్రాలలో ఎంఎల్హెచ్పీలలు విధులను సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు లేకపోలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించాల్సిన ఎంఎల్హెచ్పీల జాడ ఏజెన్సీ మండలాల్లో కానరావడం లేదు. రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ వారు పీహెచ్సీ సబ్ సెంటర్లో ఉండి ఓపీ చూడాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ పరిధిలో ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేయాలి. నడవలేని వ్యాధిగ్రస్థుల ఇంటి వద్దకే వెళ్లి వారి బీపీ, షుగర్ పరీక్షలు చేసి సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ప్రజలకు చేస్తున్న సేవ మాత్రం నామమాత్రమేనని గిరిజనులు వాపోతున్నారు. దీంతో సబ్ సెంటర్లు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలపై పనిభారం పడుతోంది. కొన్ని సందర్భాల్లో వీరు క్షేత్ర పరిశీలనలకు వెళ్తే.. సబ్ సెంటర్లలో ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు (సీహెచ్డబ్ల్యూ)తో కాలం నెట్టుకురావడం గమనార్హం. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు, గిరిజనులు కోరుతున్నారు.
ఆకస్మిక తనిఖీలు చేపడతాం
వెల్నెస్ సెంటర్లలలో విధులు సక్రమంగా నిర్వర్తించని వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం. ప్రజలకు మరింత చేరువగా వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకు విరుద్ధంగా వెల్నెస్ సెంటర్లు పనిచేస్తే చర్యలు తప్పవు.
- డాక్టర్ పి.అనిల్, ఉప వైద్యాధికారి