హామీలు నెరవేర్చలేరా?

ABN , First Publish Date - 2022-06-07T05:47:20+05:30 IST

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడని గిరిజనులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు

హామీలు నెరవేర్చలేరా?
: సీతంపేట ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజనులు

  సర్కారు తీరుపై గిరిజనుల మండిపాటు

  సీతంపేట ఐటీడీఏ ముట్టడి 

సీతంపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడని గిరిజనులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌లో చేర్చడానికి ఐటీడీఏ అధికారులు అనేక పర్యాయాలు సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేశారన్నారు. అయితే రాష్ట్ర సర్కారు ఐదో షెడ్యూల్డ్‌లో ప్రస్తావన తీసుకురాకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. జీవో నెంబర్‌-3 అమలు చేస్తామని స్పష్టం చేసినప్పటికీ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఏడాది జీడి పంటకు అగ్గితెగులు వ్యాపించడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తి కొనుగోలు చేయడం లేదని,  మద్దతు ధర కల్పించకచడం లేదని తెలిపారు.  గిరిజనులు నిరుద్యోగులుగానే ఉన్నారన్నారు. బ్లాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెప్పారు.  గిరిజనుల సమస్యలపై స్పందించాలని ఐటీడీఏ పీవో బి.నవ్యకు వినతిప్రతం అందించారు.   గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన  కార్యక్రమంలో సీపీఎం, గిరిజన సంఘం నాయకులు  తిరుపతిరావు, పడాల భూదేవి, తోట ముఖలింగం, సాంబయ్య, శ్రీరాములు, సవర మల్లయ్య, ఎం.లక్ష్మణరావు, కె.భాస్కర రావు, పత్తిక  సలీం, ఎ.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాలకొండ సీఐ జి.శంకరరావు ఆధ్వర్యంలో   వీరఘట్టం ఎస్‌ఐ హరికృష్ణ, సీతంపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ కిషోర్‌వర్మ తదితరులు బందోబస్తు నిర్వహించారు. 


Updated Date - 2022-06-07T05:47:20+05:30 IST