అప్పుడు వైరం.. ఇప్పుడు స్నేహం

ABN , First Publish Date - 2022-11-12T00:11:28+05:30 IST

గ్రామంలో పెద్దల వైరంతో విద్యా కమిటీ చైర్మన్‌ ఎన్నిక ఏడాదిగా జరగలేదు కాని ఇసుక, మద్యం బెల్టు షాపునకు మాత్రం అందరూ ఒక్కటై పాట నిర్వహించేశారు. మండలంలోని శివారు గ్రామంలో శుక్రవారం జరిగిన ఘటనిది.

అప్పుడు వైరం.. ఇప్పుడు స్నేహం

గజపతినగరం నవంబర్‌ 11: గ్రామంలో పెద్దల వైరంతో విద్యా కమిటీ చైర్మన్‌ ఎన్నిక ఏడాదిగా జరగలేదు కాని ఇసుక, మద్యం బెల్టు షాపునకు మాత్రం అందరూ ఒక్కటై పాట నిర్వహించేశారు. మండలంలోని శివారు గ్రామంలో శుక్రవారం జరిగిన ఘటనిది.

గ్రామానికి చెందిన పెద్దలు స్థానిక చంపావతి నది నుంచి ఇసుక, అలాగే గ్రామంలో ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది డిసెంబర్‌ వరకు బెల్ట్‌ షాపు నిర్వహించుకునేందుకు శుక్రవారం పాట నిర్వహించినట్లు సమాచారం. మద్యంపై రూ.3లక్షల 50వేలు, ఇసుక అమ్మకానికి రూ.3లక్షల 50వేల వరకు పాట కొనసాగినట్లు తెలిసింది. దీనిపై సచివాలయ అధికారిని వివరణ కోరగా తాను విధులకు వెళ్లకముందే గ్రామంలో పాట నిర్వహించినట్లు తెలిసిందని, తక్షణమే తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చామని అన్నారు. మద్యం పాట నిర్వహణపై ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజ్‌ వివరణ కోరగా గ్రామానికి చెందిన మహిళా పోలీస్‌ ద్వారా సమాచారం అందిందని, పెద్దలను పిలిచి విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై ఎక్సైజ్‌ సీఐ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామానికి వెళ్లి మద్యంపాటపై విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. మూడు వారాల కిందట ఇదే గ్రామంలో 48 మద్యం బాటిల్లు పట్టుకున్నారని తెలిసింది. పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ రోజు ఏకంగా మద్యం పాటకు దిగారని ఆ నోట.. ఈ నోట వినిపించింది.

Updated Date - 2022-11-12T00:11:30+05:30 IST