కక్షసాధింపునకే పేర్ల మార్పు

ABN , First Publish Date - 2022-10-09T05:14:05+05:30 IST

కక్షసాధింపునకే పేర్ల మార్పు

కక్షసాధింపునకే పేర్ల మార్పు
సాలూరు: మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి 

- పేర్లు మార్పుపై మండిపడుతున్న పార్టీ శ్రేణులు

సాలూరు: టీడీపీ నేతల కుటుంబాలను కక్షసాధించేందుకే సీఎం జగన్‌రెడ్డి పేర్లు మార్పు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు.  శనివారం తన నివాసంలో ఆమె విలేఖ రులతో మాట్లాడారు. గతంలో హెల్త్‌ వర్సిటీకి ఇప్పుడు విజయనగరం మహారాజా ఆసుపత్రి పేరు తొలగింపు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. పూర్వం దాతలు ఇచ్చినటువంటి భూములకు వారిపై గౌరవంతో పెట్టిన పేర్లను మార్చడం పిచ్చి తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలను ప్రజలు సహించరని, సరైన సమయంలో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పిన్నింటి ప్రసాదబాబు, ఆముదాల పరమేష్‌, గుళ్లు వేణు, యుగంధర్‌, బాలాజీ, సత్యం, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.   


‘మహారాజా’ పేరు కొనసాగించాలి 

గజపతినగరం: జిల్లాలో విద్య, వైద్య సదుపాయాలు పెరగడానికి కారణం పీవీజీ రాజు సేవలేనని, అటువంటి మహారాజా పేరును ప్రభుత్వం తొలగించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మహారాజా ఆసుపత్రి పేరు మార్పును ఆయన ఖండించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీవీవీ గోపాలరాజు, బండారు బాలాజీ, అట్టాడ లక్ష్మునాయుడు, వేమలి చైతన్యబాబు,  జి.గోవింద పాల్గొన్నారు. 


పరాకాష్టకు నిదర్శనం

రాజాం: మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరును సర్వజన ఆసుపత్రిగా మార్చడం వైసీపీ పరాకాష్టకు నిదర్శనమని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ మండిపడ్డారు. శనివారం ఆయన రాజాంలో విలేఖరులతో మాట్లాడారు. విజయనగరం రాజా వంశీయులను వైసీపీ ప్రభుత్వం అవమానించడం తగదన్నారు. మూడున్న రేళ్లలో ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని విమర్శించారు.   


సీఎం జగన్‌కు మతి భ్రమించింది 

నెల్లిమర్ల: ముఖ్య మంత్రి జగన్‌రెడ్డికి మతి భ్రమించినట్టు ఉందని టీడీపీ  జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు ఎద్దేవా చేశారు. దన్నానపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మహనీయుల పేర్లు మార్పుల వెనుక రాజకీయ కక్షలు స్పష్టంగా కనబడుతున్నాయని అన్నారు. సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని మహారాజా కేంద్రాసుపత్రి పేరును ప్రభుత్వం మార్పు చేయడం అప్రజాస్వామికమని టీడీపీ నెల్లిమర్ల నగర పంచాయతీ అధ్యక్షురాలు బైరెడ్డి లీలావతి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రి అనేది సర్వజనుల కోసం కాకుండా దయ్యాలు, భూతాల కోసం నిర్మిస్తారా అని ఆమె ప్రశ్నించారు.  


ఆసుపత్రి పేరు మార్చడం సరికాదు 

గంట్యాడ: మహారాజా ఆసుపత్రి పేరు మార్పుచేయడం సరికాదని టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌నాయుడు అన్నారు. గంట్యాడలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. మహారాజా ఆసుపత్రి పేరును యఽథావిధిగా ఉంచేవరకూ తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ కొప్పలవెలమ రాష్ట్ర కన్వీనర్‌ అల్లు విజయ కుమార్‌, పార్టీ నాయకులు రొంగళి కృష్ణ, రంధి చినరామునాయుడు, పెదిరెడ్ల సతీష్‌, బూడి అప్పలనాయుడు పాల్గొన్నారు. 


పేరుమార్పు దుర్మార్గం 

పాలకొండ: మహారాజా కేంద్ర ఆసుపత్రి పేరు యథతథంగా కొనసాగిం చాలని పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం పాలకొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరుమార్పు మరువకముందే వైసీపీ ప్రభుత్వం మరో దుర్మార్గపు చర్యకు పూనుకుందని విమర్శించారు. సమావేశంలో టీడీపీ మండలాధ్యక్షుడు గండి రామినాయుడు, పట్టణాధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్‌, జగదీష్‌, కరణం వరహాలనాయుడు పాల్గొన్నారు. 


ప్రముఖుల పేర్లు మార్పు దారుణం

బలిజిపేట (సీతానగరం): మహారాజ ఆస్పత్రి పేరు మార్పు మూర్ఖపు చర్య అని బలిజిపేట టీడీపీ మండల అధ్యక్షుడు పెంకి వేణు గోపాల్‌నాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రముఖుల పేర్లు తొలగింపు దారుణమన్నారు. వైసీపీ పాలకుల పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. ఇటువంటి చర్యలు మాను కోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార ్యక్రమంలో అరకు పార్లమెంటరీ కార్యదర్శి ఎం.అప్పారావు, రామ్మోహనరావు పాల్గొన్నారు. 


కూలదోయడం, పేర్లు మార్చడమే పాలనా?

- మాజీ మంత్రి పతివాడ 

పూసపాటిరేగ: కూలదోయడాలు, మహనీయుల పేర్లతో ఉన్న నిర్మా ణాల పేర్లు మార్చడమే పాలనగా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు అన్నారు. చల్లవానితోట గ్రామంలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరును మార్చి, దాని నుంచి ప్రజలను మరల్చేందుకు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి పేరు మార్చారని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు మహంతి చిన్నంనాయుడు, ఆకిరి ప్రసాద్‌, కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్‌, సువ్వాడ రవిశేఖర్‌, పతివాడ తమ్మినాయుడు, దంగా భూలోక, ఇజ్జురోతు ఈశ్వరరావు, పానీ రాజు తదితరులు పాల్గొన్నారు.


నియంతలా ముఖ్యమంత్రి తీరు

- అశోక్‌ గజపతిరాజును కలిసిన నెల్లిమర్ల టీడీపీ నాయకులు

నెల్లిమర్ల: ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి ని యంతలా వ్యవహ రిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు అన్నారు. సువ్వాడ రవిశేఖర్‌, కర్రోతు బంగర్రాజు, కంది చంద్రశేఖర్‌ తదితరులు శనివారం విజయనగరంలోని మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును కలిసి మాట్లాడారు. మహారాజా ఆసుపత్రి పేరు మార్చడంపై వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. వీరివెంట ఆకిరి ప్రసాద్‌, కర్రోతు సత్యనారాయణ, మైలపల్లి సింహాచలం, డి.భూలోక, డి.గోవింద పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-09T05:14:05+05:30 IST