లోకేష్‌ అరెస్టు దారుణం

ABN , First Publish Date - 2022-08-22T05:16:58+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్‌ చేయడంపై జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్‌ అరెస్టు దారుణం
కురుపాంలో రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులు

  ఖండించిన టీడీపీ నేతలు 

 ప్రభుత్వ తీరుపై మండిపాటు 

  కురుపాంలో నిరసన తెలిపిన శ్రేణుల అరెస్ట్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/పార్వతీపురం రూరల్‌/కురుపాం/జియ్యమ్మవలస/గుమ్మలక్ష్మీపురం,  ఆగస్టు 21 :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్‌ చేయడంపై జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడం తగదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కురుపాం  బస్టాండ్‌లో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో  టీడీపీ శ్రేణులు  రాస్తారోకో నిర్వహించారు. పరామర్శకు వెళ్తున్న నారా లోకేష్‌ను  అరెస్టు చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం కురుపాం పోలీసులు స్థానిక టీడీపీ నేతలను అరెస్ట్‌చేసి  సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ నిరసనలో టీడీపీ మండల కన్వీనర్‌ కె.వి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ .. లోకేష్‌ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రభుత్వం ఆటంకం కల్పిస్తుందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఓటుతో తగిన విధంగా సర్కారుకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు.   ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తెలిపారు.   ఈ ప్రభుత్వానికి గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతోందని   మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.  నియంతృత్వ పాలన ఎక్కువ కాలం నిలవదన్నారు.  పరామర్శకు వెళ్తున్న లోకేష్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబవని టీడీపీ కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి  ప్రశ్నించారు.  టీడీపీ నాయకుల, ఆస్తులు విధ్వంసం చేయడం, దౌర్జన్యాలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. 


 


Updated Date - 2022-08-22T05:16:58+05:30 IST