శ్మశానవాటిక కబ్జాపై న్యాయ పోరాటం

ABN , First Publish Date - 2022-12-06T23:49:43+05:30 IST

పట్టణంలో ప్రధాన కులాల వినియోగంలో ఉన్న రామాంజనేయ కాలనీ శ్మశానవాటిక కబ్జాకు గురి కావడంపై తాను చివరి ప్రయ త్నంగా న్యాయం పోరాటానికి సిద్ధమవుతున్నానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గద్దె బాబూరావు స్పష్టంచేశారు.

శ్మశానవాటిక కబ్జాపై న్యాయ పోరాటం

చీపురుపల్లి: పట్టణంలో ప్రధాన కులాల వినియోగంలో ఉన్న రామాంజనేయ కాలనీ శ్మశానవాటిక కబ్జాకు గురి కావడంపై తాను చివరి ప్రయ త్నంగా న్యాయం పోరాటానికి సిద్ధమవుతున్నానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గద్దె బాబూరావు స్పష్టంచేశారు. మంగళ వారం ఆయన శ్మశానవాటిక వద్ద విలేకర్లతో మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం శ్మశానవాటిక 2.88 ఎకరాలు ఉండాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను రూ.10లక్షలు తన సొంత నిధులు వెచ్చించి, అభివృద్ధి చేశానని చెప్పారు. ప్లాట్‌ఫారాలు, కర్మకాండల కోసం ప్రత్యేక షెడ్‌ వంటి పనులు చేశానని తెలిపారు. అయితే, పట్టణానికి చెంది కొంతమంది ఈ స్థలంలో తమ సొంత వ్యాపారాలకు సంబంధించి భవనాలు నిర్మించుకున్నారని చెప్పారు. దీనిపై పలుమార్లు మండల, జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించానని, అయినప్పటికీ, ఎటువంటి చర్యలు లేవన్నారు. ఖాళీ చేయించాలని కోర్టు ఉత్తర్వులున్నా, అమలు కావడం లేదన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ దీనిపై దృష్టి పెట్టాలని, చీపురుపల్లితో పాటు జిల్లాలో కబ్జాకి గురైన శ్మశాన వాటికలన్నీ పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తాను ఈ అంశంపై న్యాయ పోరాటానికి దిగనున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-06T23:49:54+05:30 IST