మూడు వారాల్లో భూసేకరణ పూర్తి
ABN , First Publish Date - 2022-02-19T05:35:36+05:30 IST
అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు మరో మూడు వారాల్లో భూసేకరణ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆర్డీవో భవానీశంకర్ చెప్పారు.
ఆర్డీవో భవానీశంకర్
భోగాపురం: అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు మరో మూడు వారాల్లో భూసేకరణ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆర్డీవో భవానీశంకర్ చెప్పారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఆర్అండ్ఆర్ కాలనీ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయ భూసేకరణ చివరి దశకు వచ్చిందని తెలిపారు. ఇంకా 85 ఎకరాలు సేకరించవలసి ఉందన్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు మొత్తం భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు సంబం ధించి లబ్ధిదారులు త్వరతిగతిన గృహాలు నిర్మించుకుంటున్నారని చెప్పారు. గృహాలు నిర్మించుకున్న వారికి ఎప్పటికప్పుడు పరిహారం అందిస్తామని ఆర్డీఓ వెల్లడించారు. మొత్తం పరిహారం కావలసిన వారికి ఒకేసారి అందిస్తామన్నారు. ఇలా తీసుకున్న వారు గృహాలు ఖాళీ చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లో ఆలయాలు, వీధి దీపాలు, లోతట్టు ప్రాంతాల్లో మట్టి నింపడం, శ్మశానవాటికల వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలాఖరు నాటికి లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకునేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం వీఆర్వోలతో సమావేశం నిర్వహించి... వివిధ సూచనలు చేశారు. ఈ సమావేశంలో తహసీల్దారు ఎం.రమణమ్మ, ఉపతహసీల్దారు డి.గాంధీ, ఆర్ఐలు జోగినాయుడు, హరిప్రియ, ఎయిర్పోర్టు అధికారి గిరడ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.