సద్దుమణిగిన వివాదం..!
ABN , First Publish Date - 2022-07-06T05:26:53+05:30 IST
ఎస్.కోటలో అక్రమంగా నిర్మించిన షెడ్పై నెల రోజులుగా నలుగుతున్న వివాదం సద్దుమణిగింది. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీని కలిపి నిర్మించిన ఆ షెడ్ను తొలగించేందుకు మంగళవారం సాయంత్రం సర్పంచ్ ఆధ్వర్యంలో సామగ్రిని ఖాళీ చేశారు.
షెడ్ను తొలగించనున్న ఎస్.కోట పంచాయతీ
ఎవరి పంతం నెగ్గిందోనని స్థానికంగా చర్చ
శృంగవరపుకోట, జూలై 5:
ఎస్.కోటలో అక్రమంగా నిర్మించిన షెడ్పై నెల రోజులుగా నలుగుతున్న వివాదం సద్దుమణిగింది. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీని కలిపి నిర్మించిన ఆ షెడ్ను తొలగించేందుకు మంగళవారం సాయంత్రం సర్పంచ్ ఆధ్వర్యంలో సామగ్రిని ఖాళీ చేశారు. రెవెన్యూ అధికారులకు ఇచ్చిన మాట ప్రకారం షెడ్ను తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. షెడ్ను తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి, కూల్చొద్దని మరో ప్రజాప్రతినిధి గతంలో పట్టుబట్టడంతో ఎవరి పంతం నెగ్గిందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. కాగా మంగళవారం ఉదయమే జిల్లా ఉన్నతాధికారుల నుంచి రెవెన్యూ అధికారులకు షెడ్ తొలగింపునకు ఫోన్లో ఆదేశం వచ్చింది. ఆ మేరకే రెవెన్యూ అధికారులు పంచాయతీకి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆపేందుకు ఓ ప్రజా ప్రతినిధి తీవ్రంగా జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు వారు ససేమిరా అనడంతో తప్పని పరిస్థితిలో తొలగించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఎవరికి వారే పంతంతో ఉండడంతో జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. ఆర్అండ్బీ రోడ్డును ఆక్రమించి నిర్మించిన షెడ్ కావడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన అధినాయకత్వం తెలివిగా వ్యవహరించింది.