లక్ష్యాలను నెరవేరుస్తా...
ABN , First Publish Date - 2022-10-15T04:55:40+05:30 IST
ఐటీడీఏ లక్ష్యాలను నెరవేర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ చెప్పారు. పీవోగా ఆయన శుక్రవారం బాధ్యతలను జాయింట్ కలెక ్టర్ ఆనంద్ నుంచి స్వీకరించారు.
విద్య, వైద్యం, తాగునీరు, రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం
ఐటీడీఏ పీవో విష్ణుచరణ్
పార్వతీపురం, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ లక్ష్యాలను నెరవేర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ చెప్పారు. పీవోగా ఆయన శుక్రవారం బాధ్యతలను జాయింట్ కలెక ్టర్ ఆనంద్ నుంచి స్వీకరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ... ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని చెప్పారు. తాగునీరు, విద్య, వైద్యం, తదితర అంశాలతో పాటు రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృషి కేంద్రీకరిస్తానని తెలిపారు. ఐఐటీ అనంతరం సివిల్స్ పరీక్షను 2018లో రాశానని చెప్పారు. తన తల్లిదండ్రులు సీవీ సుబ్బారావు, విజయలక్ష్మి ఉపాధ్యాయులుగా పనిచేస్తూ.. తనకు అన్ని విధాల అండగా ఉన్నారని చెప్పారు. 2019లో సబ్ కలెక్టర్గా నర్సాపురంలో విధులు నిర్వహించానని , అక్కడ నుంచి బదిలీపై ఐటీడీఏ పీవోగా పార్వతీపురానికి వచ్చినట్లు వివరించారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఐటీడీఏ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. గర్భిణుల వసతి గృహాల పరిస్థితిని విలేఖరులు ప్రస్తావించగా వాటిపై దృష్టి సారిస్తానని అన్నారు. ఐటీడీఏ ఏపీవో సురేష్కుమార్, ఏఏవో ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పీవోను కలిశారు. ఆ తర్వాత ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం గౌడుగూడ గ్రామానికి చెందిన తాడంగి నిర్మల అనే దివ్యాంగురాలుకు ఐటీడీఏ నుంచి మూడు చక్రాల వాహనాన్ని పంపిణీ చేశారు. అంతకముందు ఐటీడీఏ పీవో విష్ణు చరణ్, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ , డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి.కిరణ్కుమార్ కలెక్టరేట్లో కలెక్టర్ నిశాంత్కుమార్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.