రాజధాని పేరుతో వైసీపీ నాటకాలు
ABN , First Publish Date - 2022-10-12T05:54:27+05:30 IST
వైసీపీ నాయకులు రాజధాని పేరుతో నాటకాలు ఆడుతున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు ఆరోపించారు.
జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు
సీతంపేట, అక్టోబరు 11: వైసీపీ నాయకులు రాజధాని పేరుతో నాటకాలు ఆడుతున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు ఆరోపించారు. ద్వారకానగర్లో గల పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ వైఫల్యాలను పవన్ కల్యాణ్ గుర్తు చేస్తే, వైసీపీ నేతలు వీధి సింహాలుగా గర్జిస్తున్నారని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణ పేరుతో, బూటకపు మాటలతో మంత్రులు ఎవరిని నమ్మిస్తారని ప్రశ్నించారు. 40 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రకు ఏమి చేశారో చెప్పాలని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలను ఆయన ప్రశ్నించారు. రాజధాని కన్నా భూ అక్రమణలపైనే వైసీపీ నాయకులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. రైల్వే జోన్, స్టీల్ప్లాంట్ కోసం పోరాడకుండా రాఽజధానుల కోసం ఎందుకు నాటకాలాడుతున్నారని వైసీపీ నాయకులను తాతారావు నిలదీశారు. అనకాపల్లిలో భూ దందాలపై లోకాయుక్త సుమోటోగా తీసుకొని కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వటాన్ని తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వైసీపీని గెలిపిస్తే విశాఖలో కొండలు, గుట్టలు, భూములు ఇతర ప్రజల సంపదను దౌర్జన్యంగా లాక్కుంటారని గాజువాకలో నామినేషన్ వేసిన రోజే పవన్కల్యాణ్ చేప్పారని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ మూడు రాజధానుల కృత్రిమ ఉద్యమాన్ని తీసుకురావాలని వైసీపీ నేతలు చూస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో పసుపులేటి ఉషాకిరణ్, పీవీఎస్ఎన్ రాజు, సందీప్ పంచకర్ల, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.