సమష్టి కృషితో నగరాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-09-17T06:32:02+05:30 IST

సమష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితం కావాలని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు పిలుపునిచ్చారు.

సమష్టి కృషితో నగరాభివృద్ధికి కృషి
అధికారులతో సమావేశమైన కమిషనర్‌ రాజాబాబు

నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించం

జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు

విశాఖపట్నం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితం కావాలని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. జీవీఎంసీ కమిషనర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని విభాగాల అధిపతులు, జోనల్‌ కమిషనర్లతో సమావేశమయ్యారు. అందరినీ పరిచయం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం, ప్రజారోగ్యం, అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. చేసేపని ఏదైనా నిబందనలకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసి నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎవరైనా విధి నిర్వహణలో అలసత్వం వహించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. నగరంలో నిర్మాణాలన్నీ నిబంధనల ప్రకారమే జరగాలని, ఎక్కడైనా అనధికార నిర్మాణాలు జరిగే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. జీవీఎంసీకి సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను విభాగాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఎవరికైనా శాఖాపరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటానన్నారు. త్వరలోనే విభాగాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని అప్పటికి అందరూ సన్నద్దం కావాలని సూచించారు.

Updated Date - 2022-09-17T06:32:02+05:30 IST