జడ్పీటీసీగానే గిరిజన గ్రామాలు అభివృద్ధి చేశా

ABN , First Publish Date - 2022-10-08T06:10:48+05:30 IST

గిరిజన గ్రామాలంటే తనకు మక్కువని, తాను జడ్పీటీసీ సభ్యుడుగా ఉన్నప్పుడు తామరబ్బ, చింతలపూడిలో బ్రిడ్జిలు, తాగు నీటి సౌకర్యం కల్పించానని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

జడ్పీటీసీగానే గిరిజన గ్రామాలు అభివృద్ధి చేశా
లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు


ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు 

దేవరాపల్లి, అక్టోబరు7: గిరిజన గ్రామాలంటే తనకు మక్కువని, తాను జడ్పీటీసీ సభ్యుడుగా ఉన్నప్పుడు తామరబ్బ, చింతలపూడిలో బ్రిడ్జిలు, తాగు నీటి సౌకర్యం కల్పించానని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని చింతలపూడి పంచాయతీలో చింతలపూడి, కొత్తూరు, కోరాడ, వంతువానిపాలెం, నేరళ్లపూడి, బోడిగరువు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి కొళాయి కోసం రూ.కోటి 90 లక్షలు మంజూరు చేశామన్నారు. దివంగత ఎంపీటీసీ మాజీ సభ్యుడు బండి సత్యం పేరు మీద కమ్యూనిటీ భవనం నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. వంతువానిపాలెంలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరడంతో నివేదిక ఇవ్వాలని ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు రాములమ్మను ఆదేశించారు. ఈ సందర్భంగా చింతలపూడి పాఠశాల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు సుభాష్‌ చంద్రబోస్‌ను శాలువాలతో సత్కరించారు. అనంతరం చింతలపూడిలో మూడు రాజధానులపై నిర్వహించిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, సర్పంచ్‌ బోడమ్మ, బండిగౌరమ్మ, రామకృష్ణ శ్రీను తదితరుల పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T06:10:48+05:30 IST