నేడే జెండా పండుగ
ABN , First Publish Date - 2022-08-15T06:20:44+05:30 IST
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సోమవారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ తొలి వేడుకలకు అనకాపల్లి జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లాస్థాయి వేడుక
అనకాపల్లిటౌన్, ఆగస్టు 14: కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సోమవారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ తొలి వేడుకలకు అనకాపల్లి జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయి ఉత్సవాలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా మారింది. పెవిలియన్ భవనం ముందు సభావేదికను ఏర్పాటు చేశారు. అతిథులు ఆశీనులు కావడానికి సోఫాలు, కుర్చీలు వేశారు. వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. స్టేడియంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరేడ్ నిర్వహించే ఏఆర్ పోలీసులు ఆదివారం కూడా రిహార్సల్స్ నిర్వహించారు. స్టేడియం గ్యాలరీల పైభాగంలో స్వాతంత్య్రం సమరయోధుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, డీఆర్వో వెంకటరమణ, ఆర్డీవో చిన్నికృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి పతాకావిష్కరణ
జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో మంత్రి పరేడ్ను సమీక్షించి వందన స్వీకారం చేస్తారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు పురస్కారాలు అందజేస్తారు.