కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-11T06:05:47+05:30 IST

కేంద్రం ప్రకటించిన ఏడవ పే కమిషన్‌ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు 26 వేల రూపాయలు కనీస వేతనంగా చెల్లించాలని సీఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు.

కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న నరసింగరావు

సీఐటీయూ డిమాండ్‌

మహారాణిపేట, సెప్టెంబరు 10: కేంద్రం ప్రకటించిన ఏడవ పే కమిషన్‌ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు 26 వేల రూపాయలు కనీస వేతనంగా చెల్లించాలని సీఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు. శనివారం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది కార్మికులకు ఆయా యాజమాన్యాలు అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నాయని తెలిపారు. ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి సవరించాల్సిన కనీస వేతనాలు గత 12 సంవత్సరాల నుంచి మారలేదని వివరించారు. కనీస వేతనాలు అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన మండలిని నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల నుంచి వసూలు చేసిన వెల్ఫేర్‌, సెస్‌ నిధులు రూ.ఎనిమిది వేల కోట్లు కార్మికులకు చెల్లించలేదని వివరించారు. కనీస వేతనాలు అమలు చేసేవరకు సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. ఇందులోభాగంగా ఈ నెల 20న సరస్వతీ పార్కు వద్ద ప్రదర్శన, అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, పి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-11T06:05:47+05:30 IST