మహనీయుల త్యాగాలు వృథా కానివ్వం

ABN , First Publish Date - 2022-09-19T06:45:38+05:30 IST

మహనీయుల త్యాగాలను వృథా కానివ్వబోమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.మూర్తి యాదవ్‌ అన్నారు.

మహనీయుల త్యాగాలు వృథా కానివ్వం
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మూర్తి యాదవ్‌

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వి.మూర్తి యాదవ్‌ 

కూర్మన్నపాలెం,సెప్టెంబరు 18: మహనీయుల త్యాగాలను వృథా కానివ్వబోమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.మూర్తి యాదవ్‌ అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 584 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. ఉపాధిని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్మికులు చేస్తున్న పోరాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని, తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేయవచ్చన్నారు. కార్మికులకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఉక్కు పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, బొడ్డు పైడిరాజు, వరసాల శ్రీనివాసరావు, అయోధ్యరామ్‌, జె.రామకృష్ణ, పరంధామయ్యలు నష్టాల బూచిని చూపుతూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకోవడం దారుణమన్నారు. ‘ఉక్కు’ను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మినేని శ్రీనివాస్‌, అవతారం, తాతారావు, శ్రీనివాసరాజు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-19T06:45:38+05:30 IST