గిరి రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
ABN , First Publish Date - 2022-03-16T05:36:20+05:30 IST
గిరిజన రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు అన్నారు.
ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు
పాడేరు, మార్చి 15: గిరిజన రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు అన్నారు. మంగళవారం స్పైసెస్ బోర్డు, ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన మిరియాల నూర్పిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ టి.నరసింగరావు మాట్లాడుతూ... గిరిజన రైతులు ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించి చక్కని ఆదాయం పొందాలన్నారు. గిరిజన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. స్పైసెస్ బోర్డు ఫీల్ ఆఫీసర్ బి. కళ్యాణి మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు 75 శాతం రాయితీపై 82 మిరియాల నూర్పిడి యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా మిరియాల నూర్పిడిని అతిథులు, అధికారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సొనారి రత్నకుమారి, వైస్ ఎంపీపీ డి.కనకాలమ్మ, ఎంపీటీసీ సభ్యులు ఉషారాణి, సీహెచ్.చిట్టమ్మ, మోదాపల్లి సర్పంచ్ కొర్రా మంగమ్మ, రైతులు పాల్గొన్నారు.