MLC Mantena: అది రౌండ్ టేబుల్ సమావేశం కాదు.. వైసీపీ సర్వ సభ్య సమావేశం...
ABN , First Publish Date - 2022-09-25T16:13:44+05:30 IST
విశాఖలో జరిగేది రౌండ్ టేబుల్ సమావేశం కాదని, వైసీపీ సర్వ సభ్య సమావేశమని ఎమ్మెల్సీ మంతెన అన్నారు.
అమరావతి (Amaravathi): విశాఖ (Visakha)లో జరిగేది రౌండ్ టేబుల్ సమావేశం కాదని, వైసీపీ (YCP) సర్వ సభ్య సమావేశమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు (Mantena Sathyanarayana Raju)విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో మూడేళ్ళుగా దోచుకున్న దానిలో వాటాలు పంచుకునేందుకే ఈ సమావేశమని, లేకుంటే అధికార పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాధ్ తన మంత్రి పదవి పోతుందేమోనన్న భయంతో వణికిపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీలు చివరకు వైసీపీ నేతలు కూడా అమరావతే రాజధానిగా కావాలంటున్నారని, సీఎం జగన్ రెడ్డికి భయపడి కొంతమంది వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతిస్తున్నారన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీలోని కొంతమంది నేతలు తప్ప ప్రజా సంఘాలు, ప్రజలు ఎవరూ పాల్గొనడం లేదన్నారు. ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టాలన్న జగన్ రెడ్డి కుట్రలో భాగస్వాములైన వైసీపీ నేతలు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగులుతారని ఎమ్మెల్సీ మంతెన అన్నారు.