దసపల్లా భూములపై టీడీపీ న్యాయపోరాటం
ABN , First Publish Date - 2022-10-04T07:04:32+05:30 IST
దసపల్లా భూముల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. తొలుత సీబీఐ, ఈడీ అధికారులను కలిసి వేల కోట్ల రూపాయల విలువైన భూములు చేతులు మారడంపై దర్యాప్తు చేయాలని కోరనున్నది.
హైకోర్టులో వ్యాజ్యం, సుప్రీంకోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలుకు నిర్ణయం
సీబీఐ, ఈడీలకు కూడా ఫిర్యాదు
రూ.కోట్ల విలువైన భూములను కాపాడేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి చర్యలు తీసుకుందీ ప్రజల్లోకి తీసుకువెళతామంటున్న నేతలు
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
దసపల్లా భూముల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. తొలుత సీబీఐ, ఈడీ అధికారులను కలిసి వేల కోట్ల రూపాయల విలువైన భూములు చేతులు మారడంపై దర్యాప్తు చేయాలని కోరనున్నది. ఇదే సమయంలో హైకోర్టులో వ్యాజ్యం, ఇంకా సుప్రీంకోర్టులో ప్రైవేటు పిటిషన్ వేయడానికి సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా నగర నడిబొడ్డున సుమారు రూ.మూడు వేల కోట్ల విలువైన భూములను కాపాడేందుకు తెలుగుదేశం హయాంలో ఎటువంటి చర్యలు తీసుకున్నదీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. దసపల్లా భూములకు సంబంధించి సుమారు రెండేళ్ల నుంచి అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారని, ఇందులో భాగంగా 2020లో రెండు కంపెనీలను ఏర్పాటుచేయించారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మొత్తం లావాదేవీలపై ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు సంపాదించిన టీడీపీ నాయకులు, మరికొన్నింటిని సేకరించే పనిలో ఉన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామని, ఆ తరువాత సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని, అదే సమయంలో న్యాయస్థానాల్లో కేసు వేయాలని నిర్ణయించామని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు పార్టీ లీగల్సెల్ విభాగం ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు. కాగా దసపల్లా భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎనలేని నష్టం వాటిల్లిందని టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పతివాడ గిరిధర్ పేర్కొన్నారు. భూములు చేతుల మారడం వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు.