ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నయవంచన

ABN , First Publish Date - 2022-12-13T00:51:49+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతినెలా జీతాల కోసం తిప్పలు పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నయవంచన
మాట్లాడుతున్న జగదీశ్‌

అనకాపల్లి అర్బన్‌, డిసెంబరు 12 : వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతినెలా జీతాల కోసం తిప్పలు పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, డీఏలు పెండింగ్‌ లేకుండా చూస్తామని హామీలు గుప్పించి తీరా ఇప్పుడు వారికి మొండిచెయ్యి చూపిస్తున్నారని బుద్ద మండిపడ్డారు. సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నా అప్పుల విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతటి దిగజారుడు లేదని విమర్శించారు. పదవీ విరమణ పొందిన వారికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్లు, పెన్షనర్లకు రూ.800కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు ఓపికతో భరిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ విరమణ చేసి సంవత్సరకాలం గడచినప్పటికీ వారు దాచుకున్న పీఎఫ్‌ సొమ్ము, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందలేదన్నారు. మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.22వేల కోట్లు ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. వాటి కోసం వారంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. 1998 డీఎస్సీలో అర్హులైన వారికి ఉద్యోగ నియామకాలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, ఫైలుపై సంతకం చేసి విస్మరించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కోట్ని రామకృష్ణ, జగన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:51:51+05:30 IST