రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2022-10-04T07:06:53+05:30 IST
సెంట్రల్ జైలు వద్ద సోమవారం రాత్రి ఆటోను మినీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు.
సెంట్రల్ జైలు సమీపంలో ఆటోను ఢీకొన్న మినీ బస్సు
ఆరిలోవ, గోపాలపట్నం, అక్టోబరు 3:
సెంట్రల్ జైలు వద్ద సోమవారం రాత్రి ఆటోను మినీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఆరిలోవ ట్రాఫిక్ సీఐ షణ్మఖరావు కథనం ప్రకారం...గోపాలపట్నం నాయుడు క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన ప్రతాపరావు వెంకటగిరి పట్నాయక్ (65) ఎల్జీ పాలిమర్స్ విశ్రాంత ఉద్యోగి. వెంకటగిరి పట్నాయక్ ఆయన భార్య వరలక్ష్మి నాయుడు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ఇద్దరు విదేశాల్లో స్థిరపడగా...ఒకరు శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఉంటున్నారు. కాగా వెంకటగిరి పట్నాయక్ భార్య వరలక్ష్మికి అనారోగ్యంగా వుండడంతో తన ఇంటి సమీపంలో వున్న సోదరుడి అల్లుడు రమాకాంత్ను తీసుకుని గోపాలపట్నం ఇందిరానగర్కు చెందిన యేదూరు సత్యనారాయణరెడ్డి (55)కి చెందిన ఆటోలో సోమవారం సాయంత్రం వెంకోజీపాలెంలో గల మెడికవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి నుంచి తిరిగి గోపాలపట్నం వస్తుండగా సెంట్రల్ జైలు వద్ద రామకృష్ణాపురం సమీపంలో ఆటోను సింహాచలం వైపు నుంచి వస్తున్న మినీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటగిరి పట్నాయక్, ఆటోడ్రైవర్ సత్యనారాయణరెడ్డి సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. వరలక్మి, రమాకాంత్ గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసి మృతుల కుటుంబీకులు, బంధువులు విషాద ఛాయల్లో మునిగారు. ఆటోడ్రైవర్ సత్యనారాయణరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.