సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్షకు స్పందన
ABN , First Publish Date - 2022-03-16T05:42:36+05:30 IST
మిషన్ ఏకలవ్య పేరిట గిరిజన నిరుద్యోగులకు ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్షకు అనుహ్య స్పందన లభించిందని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.
ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ
తొలి దశ రాత పరీక్షకు 1,275 మంది హాజరు
పాడేరు, మార్చి 15: మిషన్ ఏకలవ్య పేరిట గిరిజన నిరుద్యోగులకు ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్షకు అనుహ్య స్పందన లభించిందని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. స్థానిక శ్రీక్రిష్ణాపురం బాలికలు, తలారిసింగి బాలుర ఆశ్రమ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన తొలిదశ రాత పరీక్షల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. తొలి దశ రాత పరీక్షకు 1,375 మంది దరఖాస్తు చేసి, 1,275 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. పాడేరులోని నాలుగు కేంద్రాల్లో 869 మంది అభ్యర్థులకు 812 మంది హాజరయ్యారని, 57 మంది గైర్హాజరయ్యారన్నారు. పాడేరు, చింతపల్లి, అరకులోయల్లో తొలి దశ పరీక్షకు 94 శాతం మంది హాజరయ్యారన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 19న రెండో దశ రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు.
చింతపల్లిలో 180 మంది..
చింతపల్లి: మండల కేంద్రంలో నిర్వహించిన సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్షకు 180మంది అభ్యర్థులు హాజరయ్యారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల-1లో 190 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా పది మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష కేంద్రాన్ని పాడేరు టీడబ్ల్యూ డిప్యూటీ డైరెక్టర్ సీఏ మణికుమార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణకు ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో సీతయ్య, చీఫ్ సూపరింటెండెంట్ జేఏ కొండలరావు, ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు, రూట్ అధికారి కన్నయ్యపడాల్, డిపార్టుమెంట్ అధికారి పండన్న, సంచార స్క్వాడ్ పీహెచ్ఓ భాస్కరరావు పాల్గొన్నారు.
అరకులోయలో 283 మంది..
అరకులోయ: అరకులోయలోని రెండు పరీక్ష కేంద్రాల్లో మంగళవారం జరిగిన సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్షకు 283 మంది హాజరయ్యారు. రవ్వలగుడ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో 106 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 101 మంది హాజరైనట్టు హెచ్ఎం కెందు తెలిపారు. అదే విధంగా సీఏహెచ్ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో 192 మందికి 182 మంది హాజర య్యారు. ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు లైజినింగ్ ఆఫీసర్గాను, ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో రాంబాబు, తహసీల్దార్ వేణుగోపాల్, ఇన్విజిలేటర్లుగా వెల్ఫేర్ అసిస్టెంట్స్, సచివాలయ పోలీసులు విధులను నిర్వహించారు.