రైల్వేస్టేషన్లో రెడ్ అలర్ట్
ABN , First Publish Date - 2022-10-03T05:26:08+05:30 IST
జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి రైల్వేస్టేషన్లలో పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనకాపల్లి, ఎలమంచిలిలో పటిష్ఠ పోలీసు బందోబస్తు
ఆర్ఆర్బీ ఫలితాల వెల్లడిలో జాప్యంపై నిరుద్యోగుల ఆందోళనతో అప్రమత్తం
అనకాపల్లిటౌన్/ ఎలమంచిలి, అక్టోబరు 2: జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి రైల్వేస్టేషన్లలో పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్ఆర్బీ ఫలితాల వెల్లడిలో జాప్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, రైల్వే ట్రాక్లపై నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు దిగుతారన్న నిఘా వర్గాల సమాచారంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు రైల్వే ఆస్తులకు నష్టం కలగకుండా జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ బి.విజయ్భాస్కర్ (పరిపాలన), డీఎస్పీ బి.సునీల్, సీఐ దాడి మోహనరావు అనకాపల్లిరైల్వే స్టేషన్ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. టికెట్ వున్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతించారు. కాగా అదనపు ఎస్పీ (క్రైమ్) బి.లక్ష్మీనారాయణ, అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయభాస్కర్, పరవాడ డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఎలమంచిలి స్టేషన్ను సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వీరి వెంట సీఐ గఫూర్, ఎస్ఐ అమ్మనరావు వున్నారు.