రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు:
ABN , First Publish Date - 2022-09-10T06:46:20+05:30 IST
రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
చింతపల్లిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం
వైసీపీ రాక్షస పాలనకు ప్రజల గుణపాఠం తప్పదు
మూడేళ్ల నుంచి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి లేదు
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
చింతపల్లిలో అన్న క్యాంటీన్ ప్రారంభం
చింతపల్లి, సెప్టెంబరు 9: రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శుక్రవారం చింతపల్లి పాత బస్టాండ్లో టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. మూడేళ్ల పాలనలో ప్రజలకు నరకం చూపించారని, ఏ ఒక వారు కూడా సంతోషంగా లేరని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు.. ఇలా పలు వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ను రద్దుచేస్తామని ప్రకటించిన జగన్మోహన్రెడ్డి... తీరా గద్దెనెక్కిన తరువాత మాటతప్పి, మడమ తిప్పేసి పాత పింఛన్ అమలు సాధ్యంకాదని అంటున్నారని ధ్వజమెత్తారు. గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేసినా, జీవో నంబరు-3 రద్దుకు వ్యతిరేకంఆ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయకపోయినా... గిరిజన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పడంలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా కొత్తగా చేపట్టిన పనులు ఒక్కటి కూడా కనిపించడం లేదన్నారు. యర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంతో 33 గ్రామాల గిరిజనులను నిర్వాసితులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆమె ఆరోపించారు. అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. పేదల కడుపు నింపే బాధ్యతను టీడీపీ తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, దేపూరి వెంగళయ్య, శెట్టి నాగేశ్వరరావు, రీమల ఆనంద్, భూషణం, సోమేష్, పి.గోవింద్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.