పసర మందుతో చిన్నారికి తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2022-10-03T05:23:56+05:30 IST

పసర మందు పట్టిన రెండేళ్ల చిన్నారికి సీరియస్‌ అయ్యింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి నర్సీపట్నం తరలించారు.

పసర మందుతో చిన్నారికి తీవ్ర అస్వస్థత
చిన్నారి సౌజన్యను అంబులెన్స్‌లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

- చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి నర్సీపట్నం తరలింపు 

చింతపల్లి, అక్టోబరు 2: పసర మందు పట్టిన రెండేళ్ల చిన్నారికి సీరియస్‌ అయ్యింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి నర్సీపట్నం తరలించారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో సౌజన్య(2)కి మూడు రోజుల కిందట జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలో నాటు వైద్యం చేయించి పసర మందు పట్టించారు. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండడంతో ఆదివారం ఆ చిన్నారిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి డీకే హిమబిందు ప్రాథమి చికిత్స అందించారు. చిన్నారి  ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆక్సిజన్‌ పెట్టి అంబులెన్స్‌లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి హిమబిందు మాట్లాడుతూ చింతపల్లి ఆస్పత్రిలో చిన్నారుల చికిత్స కోసం ఎస్‌ఎన్‌సీయూ అందుబాటులో ఉందన్నారు. చిన్నపిల్లల వైద్యనిపుణులు కూడా అందుబాటులో ఉన్నారన్నారు. ఆదివాసీలు శిశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పసర మందులు పట్టరాదని, దీని వల్ల ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశముందని చెప్పారు. చిన్నారులు వ్యాధులకు గురికాగానే సమీపంలోఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గాని, చింతపల్లి ఏరియా ఆస్పత్రికిగాని తీసుకొచ్చి సకాలంలో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Updated Date - 2022-10-03T05:23:56+05:30 IST