పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు ఆందోళన

ABN , First Publish Date - 2022-10-18T06:38:40+05:30 IST

ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు సోమవారం మధ్యాహ్నం భోజన విరామంలో జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గల ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు ఆందోళన
పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో భోజన విరామంలో ఆందోళన చేస్తున్న ఇంజనీర్లు

ప్రభుత్వ వైఖరిపై నిరసన 


విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు సోమవారం మధ్యాహ్నం భోజన విరామంలో జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గల ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు జగదీష్‌బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎస్‌డీఎఫ్‌, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో తనిఖీ  పేరిట ఇంజనీర్లను వేధించడం తగదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, గత పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన హామీ మేరకు తనిఖీ నివేదికలపై చర్యలు నిలుపుదల చేయాలని కోరారు. అలాగే పనుల పురోగతిపై వారం వారం లక్ష్యాలు విధించడం కలెక్టర్లు తక్షణమే మానుకోవాలన్నారు. బుధవారం వరకూ భోజన విరామంలో ఆందోళన చేస్తామన్నారు. ఈనెల 20న విజయవాడలోని ఈఎన్‌సీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే  ఈనెల 24 నుంచి పెన్‌డౌన్‌ చేయనున్నట్టు జగదీష్‌బాబు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్‌ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో విశాఖ డివిజన్‌ ఈఈ కె.శ్రీనివాస్‌, పలువురు డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T06:38:40+05:30 IST