ధాన్యం కొనుగోలుకు మీనమేషాలు

ABN , First Publish Date - 2022-12-12T00:55:25+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, గత మూడేళ్ల నుంచి వరి రైతులతో ప్రభుత్వం ఆటాడుకుంటున్నదని, ధాన్యం డబ్బులను నెలల తరబడి రైతులకు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.

ధాన్యం కొనుగోలుకు మీనమేషాలు
మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రభుత్వ తీరుతో వరి రైతుకు తీవ్ర నష్టం

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, డిసెంబరు 11: రాష్ట్రం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, గత మూడేళ్ల నుంచి వరి రైతులతో ప్రభుత్వం ఆటాడుకుంటున్నదని, ధాన్యం డబ్బులను నెలల తరబడి రైతులకు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. టీడీపీ హయాంలో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాగా రైస్‌ మిల్లర్లు నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకూడదని నిబంధనలు విధించిందని, మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలేదని, దీంతో వరి రైతులకు ఏం చేయాలో పాలుపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్‌ కారణంగా కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేక, ఇళ్లల్లో నిల్వ చేసుకోవడానికి చోటు చాలక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయడంతో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రైతులు పోరాటం చేయాలని, ప్రతిపక్షాలన్నీ అండగా వుంటాయని ఆయన భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-12-12T00:55:26+05:30 IST