నేవీ మారథాన్ లోగో ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-09-21T06:22:47+05:30 IST
నేవీ మారథాన్ లోగోను ఐఎన్ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్ కమెడోర్ నరేశ్ వారికూ మంగళవారం పార్క్ హోటల్లో ఆవిష్కరించారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నేవీ మారథాన్ లోగోను ఐఎన్ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్ కమెడోర్ నరేశ్ వారికూ మంగళవారం పార్క్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏటా డిసెంబరులో నిర్వహించే నేవీ డే ఉత్సవాలు మారథాన్తోనే ప్రారంభమవుతాయన్నారు. ఇది ఏడో మారథాన్ అని, ఈసారి రాష్ట్ర జంతువు కృష్ణ జింకను మస్కట్గా ఎంపిక చేసి లోగో తయారు చేశామన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే నినాదంతో జిల్లా అధికారులు ముందుకు వెళుతున్నందున వారికి అండగా నిలుస్తూ పర్యావరణ హితమైన వస్తువులనే ఈ మారథాన్లో ఉపయోగిస్తామని పేర్కొన్నారు. రేస్ డైరెక్టర్ డాక్టర్ నన్నపనేని మురళీధర్ మాట్లాడుతూ నేవీ మారథాన్లో పాల్గొనే వారి సంఖ్య ఏటా పెరుగుతోందన్నారు. ఫుల్ మారథాన్ (42.1 కి.మీ)కు రూ.1,600, హాఫ్ మారథాన్ (21.2 కి.మీ)కు రూ.1,600, పది కిలోమీటర్ల పరుగుకు రూ.1,200, ఐదు కిలోమీటర్ల పరుగుకు రూ.750తో పాటు పన్నులు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించామన్నారు. ఈ పోటీలన్నీ ఆర్కే బీచ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రారంభమవుతాయన్నారు. వీటిలో పాల్గొనదలచినవారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.వైజాగ్నేవీమారథాన్.కామ్లో అక్టోబరు 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేర్ ఆస్పత్రి సీవోవో శ్రీనివాస్, పార్క్ హోటల్ జీఎం జయదీప్ బిశ్వాస్, రౌండ్ టేబుల్ ఇండియా ఛైర్మన్ ప్రతిక్ సంఘి పాల్గొన్నారు.