రేషన్ కోసం మైళ్ల దూరం నడక
ABN , First Publish Date - 2022-03-04T06:07:47+05:30 IST
మండలంలోని పెద్దఅగ్రహారం ఆదివాసీలు రేషన్ సరకుల కోసం 12 కిలోమీటర్లు నడిచి తెచ్చుకుంటున్నారు. పెద్ద అగ్రహారం గ్రామానికి రహదారి ఉంది.
పెద్దఅగ్రహారం ఆదివాసీలకు తప్పని కష్టాలు
గూడెంకొత్తవీధి, మార్చి 3: మండలంలోని పెద్దఅగ్రహారం ఆదివాసీలు రేషన్ సరకుల కోసం 12 కిలోమీటర్లు నడిచి తెచ్చుకుంటున్నారు. పెద్ద అగ్రహారం గ్రామానికి రహదారి ఉంది. గ్రామంలో జీసీసీ సబ్ డిపో కూడా ఉంది.. అయినా సివిల్ సప్లయ్స్, జీసీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీలకు రేషన్ కష్టాలు తప్పడంలేదు. గురువారం గ్రామానికి చెందిన గిరిజనులు జీకేవీధి డీఆర్ డిపో నుంచి రేషన్ బియ్యం తీసుకు వెళుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యను విలేకర్లకు వివరించారు. మండలంలోని పెద్దఅగ్రహారం జీసీసీ సబ్ డిపో పరిధిలో వంద రేషన్ కార్డులున్నాయి. గతంలో ఈ డిపో నుంచే సరకులను సరఫరా చేసేవారు. ప్రస్తుతం రవాణా ఖర్చు పెరిగిపోతుందనే సాకుతో పౌరసరఫరాలు, జీసీసీ అధికారులు పెద్దఅగ్రహారం పరిధిలోనున్న కార్డుదారు లకు జీకేవీధి ప్రధాన డిపో నుంచే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా గిరిజనులు 12 కిలోమీటర్లు తలపై బియ్యం మూటలను పెట్టుకొని నడిచి వెళుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అగ్రహారం గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు గోవిందరావు, సుబ్బారావు, పార్వతి, చిలకమ్మ విజ్ఞప్తి చేశారు.