కరిగిపోతున్న కొండలు

ABN , First Publish Date - 2022-11-24T03:18:51+05:30 IST

పల్నాడు జిల్లా కోటప్పకొండలో కొండలు కరిగిపోతున్నాయి. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా అధికారం మాటున వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారు.

కరిగిపోతున్న కొండలు

కోటప్పకొండలో మట్టి మాఫియా

అనుమతులు లేకున్నా తవ్వకాలు

వందలాది లారీల్లో మట్టి తరలింపు

అధికార పార్టీ నేత వసూళ్లు

నరసరావుపేట, నవంబరు 23: పల్నాడు జిల్లా కోటప్పకొండలో కొండలు కరిగిపోతున్నాయి. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా అధికారం మాటున వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారు. మామూళ్ల మ త్తులో మునిగిన మైనింగ్‌ అధికారులు కళ్లు మూసుకున్నారు. ఇదే అదనుగా మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కొండ ప్రాంతంలో గ్రావెల్‌కు మంచి గిరాకీ ఉండటంతో కోటప్పకొండలో భారీగా అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. నిత్యం వందలాది లారీల మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. నరసరావుపేట ప్రాంతంలో ఇటీవల వెలుస్తున్న రియల్‌ వెంచర్లు పల్లంలో ఉండటంతో గ్రావెల్‌ వినియోగం పెరిగింది. దీంతో కోటప్పకొండ నుంచి నరసరావుపేటకు గ్రావెల్‌ సరఫరా చేసేందుకు లారీకి రూ.6వేలకు పైగా చార్జి చేస్తున్నారు. ఇక్కడినుంచి వెళ్లే ప్రతి లారీకి అధికార పార్టీ కీలక నేత ఒకరు కొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ మండల స్థాయి నేత ఒకరు మట్టి దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మట్టి సామ్రాజ్యాన్ని కొందరు మాత్రమే శాసిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో ఒక వర్గానికే అక్రమ గ్రావెల్‌ వ్యాపారం పరిమితమైందన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సాగుతున్న అక్రమ మైనింగ్‌ ఇలాగే కొనసాగితే కొండలు మిగిలే పరిస్థితి ఉండదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-11-24T03:18:52+05:30 IST